ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించారు. నిన్న రాత్రే ఏలూరు వచ్చిన చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు యుద్ధభేరి కార్కక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
పట్టిసీమ రైతులతో…
పట్టిసీమ రైతులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైసీపీ హయాంలో నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పడకేశాయని, తన పాలనలో పరుగులు తీసిన ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ ఆయన రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి జరిగిన, జరుగుతున్న నష్టాన్ని వివరింస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
భారీ బందోబస్తు…
పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలను ముందుగానే తీసుకున్నట్లు పశ్చిమ గోదావరి పోలీసులు తెలిపారు. అనుమతి పొందిన మార్గాల్లో చంద్రబాబు వెళ్లాలని పోలీసులు ఆంక్షలు విధించారు. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందన్నది ఉత్కంఠగా మారింది. ఉత్తరాంధ్ర వరకూ చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటన కొనసాగుతుంది.