ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. వారికి అందిన.. అందుతున్న సాయంపై జగన్ ఆరా తీయనున్నారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే హామీలు ఇచ్చే అవకాశముంది. ఈరోజు అల్లూరి సీతారామారాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించే జగన్ రేపు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడిచంాయి.
వరద బాధిత ప్రాంతాల్లో…
రాత్రికి రాజమండ్రిలో జగన్ బస చేయనున్నారు. ఇటీవల గోదావరికి వరదనీరు పోటెత్తడం, భారీ వర్షాలతో అనేక గ్రామాల్లో పంట దెబ్బతినింది. ఆస్తినష్టం కూడా సంభవించింది. ఇప్పటికే కొంత అధికారులు నష్టం వివరాలను అంచనా వేశారు. ఆయన స్వయంగా బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి పునరావాస కేంద్రాల్లో అందిన సాయాన్ని అడిగి తెలుసుకోనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఇప్పటికే ప్రభుత్వం రేషన్ తో పాటు రెండు వేల రూపాయల సాయాన్ని అందించింది.
వైసీపీ నేతలతోనూ…
అయితే వరద నష్ట తీవ్రతను అంచనా వేసి ప్రాధమిక సమాచారాన్ని తెలుసుకున్న జగన్ వారికి ఎలాంటి హామీలు ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అనేక మంది జగన్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. తమకు ప్రతి ఏడాది సంభవించే ఈ వరద బాధ నుంచి కాపాడాలని కోరనున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నాయి. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రికి రాజమండ్రిలో బస చేస్తున్న జగన్ వైసీపీ నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.