వినుకొండ నుంచి మాచర్లలోకి అక్యడి నుంచి నేడు గురజాలలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించించనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటి వరకూ లోకేష్ 2,344 కిలోమీటర్ల దూరం మేరకు నడిచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోజుకు పది నుంచి పదిహేను కిలోమీటర్ల మేరకు ఆయన నడక కొనసాగిస్తున్నారు. వివిధ వర్గాల వారీతో సమావేశమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
177వ రోజుకు…
ప్రస్తుతం నారాలోకేష్ యువగళం పాదయాత్ర 177వ రోజుకు చేరుకుంది. మాచర్ల నియోజకవర్గం కారంపూడి శివారు ప్రాంతం నుంచి సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. 4.30 గంటలకు కారంపూడి తాండా వద్ద రైతులతో లోకేష్ సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. అనంతరం 5.15 గంటలకు కారంపూడి ఎన్ఎస్పీ కెనాల్ వద్ద స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం 5.35 గంటలకు కారంపూడి చెక్ పోస్టు వద్ద ముస్లింలతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
కారంపూడి నుంచి…
ఆ తర్వాత కారంపూడి చెన్నకేశవస్వామి గుడి వద్ద యువతతో లోకేష్ సమావేశమై వారికి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము అమలు పర్చే పథకాలను గురించి వివరించనున్నారు. అనంతరం 6 గంటలకు కారంపూడి వద్ద గల వీర్లగుడి సెంటర్ లో జరగనున్న బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. అనంతరం సన్నిగుండ్లలో స్థానికులతో సమావేశమవుతారు. తర్వాత రాత్రి 9.30 గంటల ప్రాంతంలో లోకేష్ యువగళం పాదయాత్ర గురజాల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. జూలకల్లు శివారులో ఆయన బస చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.