కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించడంతో లోక్సభ సెక్రటేరియట్ కూడా సానుకూలంగా స్పందించింది. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ ప్రస్తుత లోక్సభ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కలిగింది. దీనిపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నాయి.
కర్ణాటకలో ప్రచారం చేస్తూ…
2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ప్రచారం చేస్తూ రాహుల్ గాంధీ మోదీ ఇంటిపేరు పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటి పేరు కలవారంతా బ్యాంకులను మోసగించి దేశాలను విడిచిపారిపోతున్నారన్నారు. అయితే దీనిపై కొందరు సూరత్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకుంది. దీంతో వెంటనే తన అధికారిక బంగళాను కూడా రాహుల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.
సుప్రీంకోర్టు స్టే తో…
అయితే సూరత్ కోర్టు విధించిన తీర్పుపై డివిజన్ బెంచ్కి తర్వాత గుజరాత్ హైకోర్టుకు వెళ్లినా రాహుల్ గాంధీకి ఊరట లభించలేదు. దీంతో ఆయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టేను విధించింది. దీంతో లోక్సభ సెక్రటేరియట్ కూడా ఆయనపై వేసిన అనర్హత ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ ఈ వర్షాకాల సమావేశాల్లోనే సభలోకి అడుగుపెట్టనున్నారు. త్వరలో జరగనున్న అవిశ్వాసంపై ఆయన ప్రసంగించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.