ప్రజా గాయకుడు గద్దర్కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నివాళులర్పించారు. ఐపీఎస్ అధికారిగా ఉన్న సజ్జనార్ గద్దర్ పార్ధీవ దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించడం పోలీసు శాఖలో వివాదంగా మారింది. మావోయిస్టులకు అండగా నిలిచిన గద్దర్కు పోలీసు అధికారిగా సజ్జనార్ ఎలా నివాళులర్పిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అనేక మంది మావోయిస్టులు మందుపాతర పెట్టి అమాయకులైన పోలీసులను హతమారుస్తుంటే వారికి మద్దతుగా నిలిచిన గద్దర్ కు ఎలా నివాళులర్పిస్తారని పోలీసు అధికారుల సంఘం ప్రశ్నిస్తుంది.
తనకు స్నేహితుడని…
అయితే గద్దర్ తనకు స్నేహితుడని, అతని పాటలు తనను ఆకట్టుకున్నాయని సజ్జనార్ చెప్పాడు. మానవతా హృదయంతో తాను గద్దర్కు నివాళులర్పించానని సజ్జనార్ తెలిపారు. పోలీసు అధికారిగా కాకుండా ఒక వ్యక్తిగా తాను గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించానని, అంతమాత్రం చేత పోలీసులను కించపర్చినట్లు కాదని సజ్జనార్ తెలిపారు. ప్రతి విషయంలో రంధ్రాన్వేషణ చేయకూడదని, కొన్ని విషయాల్లో మానవత్వంతో వ్యవహరించాలని ఆయన కోరారు.
ఏటీఎఫ్ అభ్యంతరం…
ఇప్పటికే గద్దర్ పార్ధీవ దేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంపై యాంటీ టెర్రరిజం ఫోరం అభ్యంతరం తెలిపింది. యాంటీ టెర్రరిజం ఫోరం కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ గద్దర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయడమంటే పోలీసు వ్యవస్థను ప్రభుత్వం అవమానపర్చడమేనని పేర్కొన్నారు. పోలీసు అమరవీరులను అగౌరవపర్చడంగా తాము భావిస్తున్నామని తెలిపారు. కాగా గద్దర్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఆయన అంత్యక్రియలు ఆల్వాల్లోని ఆయన విద్యాలయంలో మరికాసేట్లో జరగనున్నాయి.