విశాఖలోని రిషికొండ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రిషికొండ వద్ద అక్రమ నిర్మాణాలంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు పిలుపు నివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రిషికొండ దగ్గర జరుగుతున్న నిర్మాణాల వద్ద నిరసనలు తెలపాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అక్కడ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నిర్మిస్తుండటంతో పోలీసులు కూడా అటు వైపు ఎవరినీ రానివ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
జనసేన నేతల నిరసన…
దీంతో రిషికొండ వద్ద టెన్షన్ నెలకొంది. మెట్ల మార్గంలో మోకాళ్లతో నడుస్తూ నిరసనలకు జనసేన నేతలు సిద్ధమయ్యారు. భీమిలి నుంచి వెళుతున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని చెప్పారు. అయితే అక్కడ ఆలయం కోసం దర్శనం కోసం వెళుతున్నామని చెప్పి అక్కడకు జనసేన నేతలు వెళారు. రిషికొండ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఉండటంతో అక్కడకు వెళ్లారు. ఆ ఆలయం చుట్టూ పోలీసులు కాపలా కాస్తున్నారు. రిషికొండ వద్ద జరుగుతున్న నిర్మాణాల వద్దకు మాత్రం అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. బీచ్ రోడ్డులోనూ పోలీసులు ఆంక్షలు విధించారు.