పోలవరం నిర్మాణంలో తమ ప్రభుత్వం ఎవరి క్రెడిట్ పొందడానికో ప్రయత్నించదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. పోలవరం విషయంలో ప్రజలకు న్యాయం చేయడానికే తాము కృషి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే సంకల్పంగా తీసుకున్నామని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జత చేసి ఇస్తుందని, త్వరలోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పోలవరం ముంపు బాధితులకు అందిస్తామని తెలిపారు.
అంతే మంచే…
పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. పునరావాస ప్యాకేజీని తమ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుందన్నారు. త్వరలోనే పునరావాస ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ నేరుగా బాధితులకు చెల్లించినా తమకు అభ్యంతరం లేదని జగన్ తెలిపారు. అంతా మంచే జరుగుతుందని జగన్ కూనవరం ప్రజలకు బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుందన్న భరోసాను జగన్ ఇచ్చారు.
అందరికీ న్యాయం…
ముంపు ప్రాంతాల్లో లీడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. మూడు దశల్లో పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని తెలిపారు. ఒక్కసారి నీరు నింపితే డ్యామ్కు డ్యామేజీ జరిగే అవకాశముందని జగన్ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళుతున్నామని తెలిపారు. వరద సాయం అందలేని ఒక్క ఫిర్యాదు తనకు రాకపోవడంతో ఆయన అధికారులను అభినందించారు. ప్రతి బాధితుడికీ సాయం ప్రభుత్వం అందించేలా అన్ని చర్యలు తీసుకుందన్నారు. అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కూనవరంలో వరద బాధితులతో జగన్ మాట్లాడారు.