ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభకు చేరుకుంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అధికార పార్టీ, ఆమోదం పొందకుండా ఉండేలా విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం లోక్సభలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో మాత్రం బలం లేకపోవడమే. తమకు అనుకూలంగా ఉండే పార్టీల మద్దతును కోరుకుంటున్నాయి. అయితే అధికార పక్షంలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న కొన్ని పార్టీలకు చెందిన ఎంపీలు క్రాస్ ఓటింగ్కు పాల్పడే అవకాశముందన్న సూచనలు వినవస్తున్నాయి.
విప్ జారీ చేసి…
రాజ్యసభలో మొత్తం 243 మంది సభ్యులున్నారు. అందులో ఐదు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఢిల్లీ ఆర్డినెస్స్ బిల్లుకు ఓటింగ్ జరిగితే 238 సభ్యులు మాత్రమే ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎవరికి 123 ఓట్లు వస్తే అది గెలిచినట్లే. అందుకోసమే అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ తమ సభ్యులకు విప్ను జారీ చేశాయి. ఖచ్చితంగా సభకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో 238 మంది సభ్యులు ఓటింగ్కు హాజరయ్యే అవకాశముంది.
ఆయన మాత్రం…
అయితే వైసీపీకి తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులున్నారు. వీరిలో ఎనిమిది మంది సభ్యులు ఓకే. ఒకే ఒక్కడు ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనన్న భయం ఇటు పార్టీలోనూ ఉంది. ముఖ్యమంత్రి జగన్ బీసీ కోటా కింద తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారు. అయితే రాష్ట్ర అధికారాలను కాలరాస్తూ తీసుకు వచ్చిన ఈ బిల్లుపై ఆయన సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకించింది. బీజేపీ నిర్ణయాన్ని తప్పుపట్టింది.
అనుమానాలు…
దీంతో ఆర్ కృష్ణయ్య ఓటింగ్ జరిగితే అనుకూలంగా వేస్తారా? లేదా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఆర్. కృష్ణయ్య మాత్రం ఇంత వరకూ దీనిపై తన అభిప్రాయాన్ని తెలపలేదు. అయితే క్రాస్ ఓటింగ్కు పాల్పడే అవకాశముందని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత తెలపడంతో వైసీపీలో ఇదే పెద్ద చర్చగా మారింది. బిల్లుకు ఆమోదం తెలపాలన్న వైసీపీ నిర్ణయాన్ని ఆర్. కృష్ణయ్య సమర్థిస్తారా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది. అందుకే ఆయన పార్టీ గీసిన గీత దాటుతారా? లేదా? అన్నది మాత్రం హాట్ టాపిక్గా మారింది.