తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నేడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మరికొద్ది రోజుల్లో కొత్త పాలకమండలి ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ నెల 10వ తేదీన టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలను స్వీకరిస్తారు. ఆ తర్వాత కొత్త పాలకమండలి కూడా ఏర్పాటు కానుంది. ఈ సమయంలో పాలకమండలి తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. నాలుగు కోట్ల రూపాయలతో అలిపిరి నడకమార్గంలో నరశింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తులు సౌకర్యర్దం షెడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రెండు ఘాట్ రోడ్లలో…
రెండున్న కోట్ల రూపాయల వ్యయంతో పిఏసిలో భక్తులు సౌకర్యం కోసం మరమత్తు పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేయనున్నారు. మరో నాలుగున్న కోట్ల వ్యయంతో నాణ్యత పరిశిలనకు ల్యాబ్ ఆధునికరణ పనులు చేపడతారు. ఇరవై మూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో వ్యయంతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణానికి 3 కోట్లు కేటాయించారు. 3.1 కోట్ల రూపాయలను మంగాపురం ఆలయం వద్ద అభివృద్ది పనులుకు కేటాయించారు.
తిరుపతిలో…
9.85 కోట్ల వ్యయంతో వకుళామాత ఆలయం వద్ద అభివృద్ది పనులుకు నిధులు కేటాయించారు. 2.6 కోట్లు వ్యయంతో తిరుమలలో అవుటర్ రింగ్ రోడ్డులో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శ్రీనివాస సేతు ప్రాజేక్ట్ కి పనులు ప్రాతిపాదికన 118 కోట్లు కేటాయిస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళశాల అభివృద్ది పనులుకు 11.5 కోట్లు కేటాయించారు. రుయా ఆసుపత్రిలో టిబి వార్డు ఏర్పాటుకు 2.2 కోట్లు కేటాయించారు. 11 కోట్లతో ఎస్వీ సంగీత కళశాల అభివృద్ది పనులు కోసం కేటాయించారు. తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం,పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ది పనులుకు 1.25 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ని టిటిడి ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు.