హర్యానా ప్రభుత్వానికి పంజాబ్, హర్యానా హైకోర్టులు షాకిచ్చాయి. నుహ్ జిల్లాలో కూల్చివేతలను తక్షణమే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశాయి. అల్లర్లకు కారణమైన వారి భవనాలను కూల్చివేసేందుకు హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుల్డోజర్తో వారు నివసించే భవనాలను కూల్చి వేసింది. అయితే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి.
బుల్ డోజర్లతో…
దీంతో హర్యనా ప్రభుత్వం బుల్డోజర్తో కూల్చివేతను నిలిపివేసింది. హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. అయితే అల్లర్లకు కారణమయిన వారిని గుర్తించిన హర్యానా ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని భవనాలను కూల్చివేసింది. వారి నుంచే అల్లర్లలో నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించేందుకు ప్రత్యేక చట్టం కూడా తేవాలని హర్యానా సర్కార్ యోచిస్తుంది.
ఆగిన కూల్చివేతలు…
ఈ నేపథ్యంలో బుల్ డోజర్ తో 350 గుడిసెలతో పాటు యాభై భవనాలను కూల్చివేసింది. దీనిపై ఒకవర్గంపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యగా కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇరువురి వాదనలను విన్న న్యాయస్థానం కూల్చివేతలను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి కూల్చివేతలు చేయవద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు జారీ చేయడంతో వెంటనే ప్రభుత్వం వాటిని నిలిపివేసింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.