జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు ఇంకా చొరబొడుతూనే ఉన్నారు. సైన్యం అప్రమత్తంగా ఉన్నప్పటికీ పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించి అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. జమ్మూ కాశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి పారేశాయి. వారు ఇద్దరూ హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.
వారిద్దరూ…
మృతుల్లో ఒకరు సెల్ఫ్ స్టైల్ డివిజనల్ కమాండర్ మునీర్ హుస్సేన్గా గుర్తించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఉగ్రవాది అతనికి బాడీగార్డుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇద్దరూ నియంత్రణ రేఖ దాటి డేగ్వార్ సెక్టార్ సరిహద్దు వద్ద సైన్యనానికి ఎదురు బడటంతో అప్రమత్తమై వెంటనే వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వారిద్దరూ మరణించినట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న వారి కదలికలను బట్టి ఉగ్రవాదులుగా గుర్తించామని చెప్పారు.
సైన్యం అప్రమత్తమై…
తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆర్మీ సకాలంలో గుర్తించడంతో వారు సరిహద్దు రేఖ దాటి లోపలకు రాలేకపోయారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకడు పూంఛ్లోని బాగిలగ్రా గ్రామానికి చెందిన వ్యక్తి అని గుర్తించినట్లు తెలిపారు. సరిహద్దు వద్ద భారత బలగాలు నిరంతరం డేగ కళ్లతో కాపలా కాస్తున్నాయని, ఎవరినీ దేశంలోకి చెరబొడనివ్వకుండా సైన్యం ప్రయత్నిస్తుందని జమ్మూకు చెందిన పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్ట్వాల్ తెలిపారు.