రాజ్యసభలోనూ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు గట్టెక్కింది. మామూలుగా కాదు. అధికారపక్షం తీర్మానాన్ని ఆమోదిస్తూ అత్యధిక మంది ఈ బిల్లుకు మద్దతు పలికారు. నిన్న రాత్రి రాజ్యసభలో జరిగిన ఓటింగ్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి. దీంతో రెండు సభల్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందినట్లయింది.
ఢిల్లీ ఆర్డినెన్స్కు…
ఢిల్లీలో కొన్ని ముఖ్యమైన అధికారుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికే అధికారాలుంటాయని సుప్రీంకోర్టు చెప్పడంతో ఈ ఆర్డినెన్స్ను ప్రభుత్వం ఈ సమావేశాల్లో అత్యవసరంగా తెచ్చింది. రాష్ట్ర అధికారాలను హరించే విధంగా ఉన్న బిల్లును వ్యతరికించాలని, ప్రజాస్వామ్యానికి ఇలాంటి బిల్లులు పెద్ద ప్రమాదమని విపక్ష కూటమి పెద్దయెత్తున ప్రచారం చేసింది. అయినా కొన్ని పక్షాలు బిల్లును ఆమోదించడంలో అధికార పక్షానికి సహకరించాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు.
విపక్షాలు ఐక్యతగా….
అయితే విపక్ష “ఇండియా” కూటమి మాత్రం ఈ బిల్లు విషయంలో మరో ఐక్యతను కనపర్చాయి. రాజ్యసభలో 101 ఓట్లు విపక్షానికి ఉండగా 102 ఓట్లు రావడంతో ఒక్క ఓటు ఎవరిదన్న చర్చ జరుగుతుంది. వైసీపీ, బిజూ జనతాదళ్ సభ్యులు కూడా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు మద్దతు తెలిపాయి. విపక్ష పార్టీలు పెట్టిన పలు సవరణలు కూడా వీగిపోయాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఆరోగ్యం సహకరించకపోయినా వీల్ ఛెయిర్లో వచ్చి తన ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది.