మృత్యువు అనేది చెప్పేది రాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జీవితం మన చేతిలో లేదన్న విషయం విశాఖలోని ఒక కుటుంబం విషయంలో మరోసారి అర్థమయింది. వేదాంతం కాకపోయినా జరుగుతున్న ఘటనలు అదే స్పష్టం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయంటే.. కొన్ని అనుకోకుండా జరిగే ప్రమాదాలుంటాయి. మరికొన్ని స్వయంకృతాలుంటాయి. అందులో పూటుగా మద్యం తాగి వాహనం నడపొద్దురా బాబూ అంటూ ఎంత మొత్తుకుంటున్న వినరు. మద్యం మత్తులో ఒక కుటుంబంలోని ఇద్దరు సభ్యులు మరణించిన సంఘటన విశాఖలో జరిగింది.
అదుపుతప్పి…
సోమవారం రాత్రి విశాఖలో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. తమ తప్పు కాకపోయినా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భీమిలీలోని సాగర్ నగర్ నుంచి ఎండాడ వైపు వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. కానీ అప్పటికే ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు.
మద్యం తాగి…
ద్విచక్ర వాహనంపై వెళుతున్న పృథ్వీరాజ్, ప్రియాంక సంఘటన స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. వారికి తెలియదు. మృత్యువు కారు రూపంలో వస్తుందని. ఒడిశా నుంచి వచ్చిన వారు కారు ప్రమాదంలో అశువులు బాశారు. కారులో వెనక సీట్లో కూర్చోని ఉన్న మణికుమార్ కూడా మృత్యువాత పడ్డారు. దీంతో మద్యం తాగి వాహనం నడిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారు. విశాఖ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతిగా మద్యం తాగి వాహనం నడపటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా తమ విచారణలో తేల్చారు.