నేడు రెండో రోజు ముఖ్యమంత్రి జగన్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మడివరంలో ఆయన పర్యటన జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ నిన్నటి నుంచి అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వారికి ప్రభుత్వం నుంచి అందిన సాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులతో పాటు పోలవరం ముంపు బాధితులతో కూడా జగన్ మాట్లాడారు. వారికి సత్వరం న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
వరద బాధితులతో…
నిన్న రాత్రి రాజమండ్రిలో బస చేసిన జగన్ వైసీపీ నేతలతో సమావేశమై తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. నేడు ముమ్మడివరంలోని గురజాపులంక, లంక ఆఫ్ ఠాణేలంక, అయినివిల్లి మండలం కొండుకుదురు లంక గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. అక్కడి వరద నష్టాన్ని పరిశీలించిన అనంతరం బాధితులతో జగన్ నేరుగా మాట్లాడనున్నారు. వారి సమస్యలను విని అక్కడికక్కడే కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయనున్నారు. దీంతో జగన్ పర్యటనకు లంక గ్రామాల్లో అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు.
సాయం అందడంపై…
ప్రతి ఏడాది గోదావరి ఉధృతితో అనేక లంక గ్రామాలు మునిగిపోతున్నాయి. వారినందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి వెళ్లేటప్పుడు రేషన్తో పాటు రెండు వేల రూపాయలను కూడా ఇచ్చి పంపుతున్నారు. ఈ సాయం వారికి అందిందా? పంట నష్టం ఎంత వరకూ జరిగింది? ఆస్తి నష్టం వివరాలేంటి తదితర సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి జగన్ బాధితులతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి అక్కడి నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళతారు.