లోక్సభలో నేడు అవిశ్వాసంపై చర్చ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు అవిశ్వాసంపై చర్చ జరగనుంది. ఈ చర్చను మధ్యాహ్నం పన్నెండు గంటలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించే అవకాశాలున్నాయి. మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. మణిపూర్లో జరిగిన ఘటనపై ప్రభుత్వం స్పందించాలని కోరినా ప్రధాని నుంచి సమాధానం రాకపోవడంతో విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించాయి.
మూడు రోజుల పాటు…
ఈ మేరకు ఈరోజు నుంచి మూడు రోజుల పాటు అవిశ్వాసంపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ చర్చ జరుగుతుంది. చివరి రోజు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పే అవకాశముంది. ప్రధానంగా మణిపూర్ అంశంతో పాటు హర్యానా అల్లర్లు, అక్కడ భవనాల కూల్చివేతలు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు వంటివి ఈ సందర్భంగా విపక్షాలు తమ ప్రసంగాల్లో లేవెనెత్తేందుకు అవకాశం కనిపిస్తుంది. దీనికి ధీటుగా అధికార పార్టీ సమాధానం చెప్పేందుకు సిద్ధమయింది.
గెలిచే అవకాశం లేకున్నా…
లోక్సభలో అవిశ్వాస తీర్మానం గెలిచే అవకాశాలు లేవు. అధికార బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. బీజేపీకి మొత్తం 301 మంది సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి 140 మంది సభ్యుల బలం ఉంది. ఎటూ కాని సభ్యులు నలభై మంది వరకూ ఉన్నారు. అధికార పార్టీకి మరో 29 మంది సభ్యుల మద్దతు కూడా ఉండటంతో అవిశ్వాసం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయినా ప్రజల ఎదుట సమస్యలను చెప్పేందుకు విపక్షాలు అవిశ్వాసాన్ని అనుకూలంగా మార్చుకోనున్నాయి.