తూర్పు గోదావరి జిల్లాలో నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులను సందర్శించడంలో భాగంగా చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పనుల పురోగతిని పరిశీలించారు. నేడు తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు.
రోడ్డు మార్గంలో…
ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు రోడ్డు మార్గంలో ముప్ఫయి కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజమండ్రి నుంచి సీతానగరం వరకూ చంద్రబాబు పర్యటన సాగనుంది. ప్రాజెక్టుల పరిశీలనతో పాటు రోడ్ షోలు నిర్వహించడం, బహిరంగ సభలను నిర్వహించడం వంటివి చంద్రబాబు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను ఎంతగా నిర్వీర్యం చేసిందీ ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ వెళుతున్నారు.
భారీ బందోబస్తు…
ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. రోడ్ షోలతో పాటు ఆయన సభలకు కూడా పెద్దయెత్తున జనం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉండటంతో పోలీసులు విస్తృతమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.