రైతులకు బేషరతుగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబేనని ఆయన అన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఏ మాత్రం అవగాహన లేకుండా నిర్మాణాలు చేపట్టి, వారం వారం కమీషన్ల కోసం పోలవరం వచ్చిన చంద్రబాబు ప్రాజెక్టు పనులు నత్తనడకన నడిపించారన్నారు. నినాదం మాత్రం సోమవారం పోలవరం కానీ ఆరోజు కమీషన్లు దండుకునే వారమని ఆయన ఫైర్ అయ్యారు.
ఏటీఎంలా వాడుకుని…
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నది చంద్రబాబు అని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను భరత్రామ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాం సగం కట్టి డయాఫ్రం కట్టడం వల్లనే వరదలకు అది కూలిపోయిందన్నారు. ఇప్పుడు డబుల్ డయాఫ్రం వాల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అది కడితేనే పనులు జరగని పరిస్థితి నెలకొని ఉందన్న భరత్ రామ్, ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి పూర్తిగా చంద్రబాబు మాత్రమే బాధ్యత వహించాలని అన్నారు.
ఓట్ల రాజకీయాలు…
తాను పోలవరం ప్రాజెక్టుకు వస్తున్నందునే జగన్ ముంపు బాధితులకు పరిహారం ప్రకటించారని, మంత్రులు సందర్శిస్తున్నారని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓట్ల రాజకీయాలు చేసే చంద్రబాబు ప్రతిదీ అదే కోణంలో చూస్తారన్నారు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చినా జనం తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎంపీ భరత్ రామ్ తెలిపారు. జగన్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా పరుగులు తీస్తున్నాయని భరత్ రామ్ అన్నారు. ఏపీ సంక్షేమ పథకాల పట్ల యావత్ భారతదేశం చూస్తుండటం నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు.