ఈటల రాజేందర్ తెలంగాణలో దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ కాలంలో కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగారు. బీసీ నాయకుడిగా ఎదిగిన ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో మొన్నటి వరకూ కీలకంగా పనిచేశారు. అధికారంలోకి వచ్చిన రెండు సార్లు ఆయన కేసీఆర్ కేబినెట్లో ఉన్నారు. మాటకారిగా, ఓటు బ్యాంకున్న నేతగా ఆయనకు పేరుంది. మావోయిస్టుల సానుభూతిపరుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన ఈటల రాజేందర్ను సులువుగానే పాలిటిక్స్లో అనుకోకుండా పదవులు వరించాయి. ఆయన కోరుకోకుండానే పదవులు దక్కాయి.
బర్త్రఫ్ చేయడంతో…
అయితే ఆయనను మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఎంత వ్యయం చేసినా ఈటల గెలుపును అడ్డుకోలేకపోయారు. ఈటలకు హుజూరాబాద్ ప్రజలతో విడదీయరాని బంధం. సంబంధం. హుజూరాబాద్ నుంచి ఏడుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 2004లో హూజురాబాద్ నియోజకవర్గంలో కాలుమోపిన రాజేందర్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఏడుసార్లు అక్కడ విజయం సాధించారంటే ఆషామాషీ కాదు. సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఆయనకే జనం పట్టం కట్టారు.
గజ్వేల్ నుంచి పోటీ…
అయితే ఈసారి ప్లాన్ మార్చారని చెబుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నారు. హుజూరాబాద్లో ఈసారి తన సతీమణి జమునను పోటీ చేయించి తాను గజ్వేల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా గజ్వేల్లో ఈటల పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే హుజూరాబాద్ నుంచి జమున పోటీకి కూడా కేంద్ర నాయకత్వం అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
ఓటమి పాలయినా…
గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కొనడం అంత సులువు కాదు. ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మామూలుగా జరగలేదు. సంక్షేమ పథకాల అమలు కూడా అక్కడ జరిగినట్లు మరెక్కడా జరగలేదు. ప్రతి ఇంటికీ ఏదో ఒక ప్రయోజనం ప్రభుత్వం నుంచి అందింది గజ్వేల్ నియోజకవర్గమే. అయితే అక్కడ కూడా బీసీ ఓటు బ్యాంకు కీలకంగా ఉండటంతో ఈటలను బీజేపీ అధినాయకత్వం బరిలోకి దింపుతుందని చెబుతున్నారు. ఓటమి పాలయినా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈటలకు మరో పదవి వచ్చే అవకాశం ఉండటం, హుజూరాబాద్లో తన సతీమణికి టిక్కెట్ కేటాయించడం వంటి వాటితో ఆయన అంగీకరించారంటున్నారు. మరి ఈటల చేస్తున్న ఈ ప్రయత్నం ఎటు వైపు దారితీస్తుంది. తొలిసారి ఓటమిని చవి చూస్తారా? లేదా విజయంతో కాలరెగరేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.