మరోసారి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్ కోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్తోనూ, రకుల్ తోనూ సంబంధం లేకుంటే ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందో చెప్పాలంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. డ్రగ్స్ కేసుపై విచారణ జరిపించాలని తామే కోర్టుకు వెళ్లినట్లు చెప్పిన ఆయన ప్రజాప్రయోజనం వేసి డ్రగ్స్ కేసును విచారించాలని పట్టుబట్టామని తెలిపారు.
డ్రగ్స్ తో సంబంధం లేకుంటే…
ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెయ్యి కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామంటే… వెయ్యి కోట్లు ఇచ్చి ఏమైనా తిట్టొచ్చా అని మంత్రి కేటీఆర్ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్తోనూ, రకుల్్తోనూ సంబంధం లేకుండా నువ్వు కోర్టుకు ఎందుకు వెళ్లి స్టే తెచ్చుకున్నావని ప్రశ్నించారు. పరువే లేనోడు పరువు నష్టం దావా వేస్తారా? అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో సినీ పరిశ్రమకు చెందిన వారిని డ్రగ్స్ కేసు నుంచి తప్పించాలనుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.
గద్దర్ తనతో అన్నాడని…
గద్దర్ తనకు గతంలోనే చెప్పాడని, పొలిటికల్ క్రిమినల్తో పోట్లాడుతున్నావని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారన్నారు. అమరవీరులను అందుకే కేసీఆర్ కించపర్చారని అన్నారు. ఈ రెండు రోజులు తాను మాట్లాడకపోవడం రాజకీయం చేయకుండా ఉండటం కోసమేనని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, రేవంత్ రెడ్డికి సంబంధం లేదని కేటీఆర్ ఎలా అంటారని, ఉద్యమంతో సంబంధం లేని ఎంఐఎంతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటూ ప్రశ్నించారు. తనకు, చంద్రబాబునాయుడుకు ఎలాంటి సంబంధాలు లేవని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ పక్షాన నిలిచానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు