ఉత్తరభారతంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనజీవనం స్థంభించి పోయింది. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక మంది నిరాశ్రయులుగా మారారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. మృతుల సంఖ్య పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్లో…
ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టారు. కొండచరియల కింద ఉన్న జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంట నష్టం ఎంత అనేది ఇంకా అంచనాలు రూపొందించకపోయినా భారీగా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రహదారులు కూడా అనేక చోట్ల ధ్వంసమయ్యాయి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
హిమాచల్లోనూ…
కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా యాభై మంది వరకూ మృతి చెందారు. ఈ మేరకు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి సహాయక చర్యలను ప్రారంభించాయి. భారీ వర్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం ఎక్కువగా ఉండటంతో ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అధికారులను సెలవులు రద్దు చేశారు. పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొనాలని సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది.