తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నాలుగురోజుల పాటు విశాఖ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. నిన్నటి వరకూ ప్రాజెక్టుల పరిశీలన పేరుతో పది రోజుల పాటు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేసిన చంద్రబాబు మరోసారి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఆయన పాదయాత్ర చేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు మధ్యాహ్నానికి విశాఖపట్నానికి చంద్రబాబు చేరుకుంటారు.
నేడు బీచ్రోడ్లో…
అనంతరం బీచ్రోడ్లో సాయంత్రం నాలుగు గంటలకు ఇండియా విజన్ పేరిట 2047 ఆవిష్కరణలో పాల్గొంటారు. మేధావులు, యువతతో చంద్రబాబు సమావేశమై దేశ భవిష్యత్ గురించి చర్చిస్తారు. ఈరోజు సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్లో జరగనున్న సభలోనూ చంద్రబాబు పాల్గొంటారు. ఈ సభకోసం తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా యువత అత్యధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు.
రేపటి నుంచి…
రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ నుంచి భవిష్యత్ గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వివిధ ప్రాంతాల్లో సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొంటారు. 16వ తేదీన మండపేటలో జరిగే కార్కక్రమంలో పాల్గొంటారు. 17వ తేదీన కొత్తపేటలోనూ, 18వ తేదీన అమలాపురం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన సాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమం విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.