తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 185వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ లోకేష్ 2,476 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు కూడా మంగళగిరి నియోజకవర్గంలోనే నారా లోకేష్ పాదయాత్ర జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇప్పటికే నాారా లోకేష్ రాయలసీమ, కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించి వచ్చారు. అక్కడ విశేష స్పందన వచ్చింది. అంతకు మించి స్పందన ఇక్కడ వచ్చేందుకు వీలుగా మంగళగిరిలో సూపర్ సక్సెస్ చేసేందుకు పార్టీ యంత్రాంగం విశేష కృషి చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా పార్టీ చర్యలు చేపట్టింది.
సొంత నియోజకవర్గం కావడంతో…
మంగళగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో పాదయాత్ర సక్సెస్ఫుల్గా పూర్తి చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. అందుకే పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కువ రోజులు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలం టచ్ చేసేలా యువగళాన్ని రూపొందించారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో యువగళం పాదయాత్ర మంగళగిరిలో కొనసాగుతుంది. ఇందుకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల కంటే తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో యువగళం విజయవంతం అవ్వాలని లోకేష్ ఆశిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నేతలు ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్రను మంగళగిరిలో విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
మధ్యాహ్నం నుంచి…
ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం నిడమర్రు సెంటర్లో లోకేష్ పసుపు రైతులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంలకు బేతపూడి బాపూజీనగర్లో స్థానికులతో సమావేశమై వారి సమస్యలపై లోకేష చర్చించనున్నారు. సాయంత్రం నాలుగు గంటకు మంగళగిరి రైల్వే గేటు సమీపంలో మహిళలతో సమావేశమై వారితో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
టిడ్కో లబ్దిదారులతో…
సాయంత్ర 4.30 గంటలకు మంగళగిరి మార్కెట్ యార్డు వద్ద టిడ్కో గృహాల లబ్దిదారులతో సమావేశం కానున్నారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలను ఈ ప్రభుత్వం అప్పగించకపోవడాన్ని ఆయన గుర్తు చేయనున్నారు. అనంతరం పాతబస్టాండ్ వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో సమావేశమవుతారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద బీసీ సామాజికవర్గీయులతో సమావేశం కానున్నారు. వారి సమస్యలపై చర్చించనున్నారు.సాయంత్రం 5.25 గంటలకు మంగళగిరి బస్టాండ్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రికి యర్రబాలెం డాన్బాస్కో స్కూలు వద్ద లోకేష్ బస చేయనున్నారు. నారా లోకేష్ బస చేసే వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ బస ప్రాంతంలోకి చొరబడకుండా పోలీసులతో పాటు నారా లోకేష్ ప్రయివేటు సైన్యం కూడా నిత్యం పహారా కాస్తుంది. పార్టీ కార్యకర్తలు కూడా లోకేష్ యువగళం పాదయాత్రకు సెక్యూరిటీగా ఉన్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.