నాలుగున్నరేళ్లలోనే గ్రామస్వరాజ్యానికి అర్థం తెచ్చామని ముఖ్యమంత్రి CM జగన్ అన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, డిజిటిల్ లైబ్రరీలను తెచ్చామన్న జగన్ ప్రభుత్వం అందించే అన్ని సేవలను ఇంటింటికి చేర్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని జగన్ స్వీకరించారు.
ఏ ప్రభుత్వమూ…
గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని మార్పులు తెచ్చామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. మహిళ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ అక్క చెల్లెమ్మ పేరిట ఇస్తున్నామని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని జగన్ అన్నారు. లంచాలకు, అవినీతికి తావు లేకుండా పారదర్శకత పాలనను అందిస్తున్నామని జగన్ అన్నారు. పేదలకు రెండు లక్షల ముప్ఫయి వేల కోట్ల రూపాయలను నేరుగా అందించి వారిని ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూశామని జగన్ వివరించారు.
అర్హులైన అందరికీ… CM
కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించామని జగన్ అన్నారు. రాష్ట్రానికే కాకుండా దేశానికి అన్నంపెట్టే అన్నదాతను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి అవసరమైన అన్ని సేవలను చెంతకే తీసుకెళ్లామని తెలిపారు. పంటల బీమాతో రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న జగన్ వారికి ఉపయోగపడే పలు పథకాలను తీసుకొచ్చి అన్నదాతలు ఆనందంగా ఉండేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
పోలవరం ప్రాజెక్టును…
పోలవరం ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న జగన్ త్వరలోనే తీపికబురు చెబుతామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను ఇప్పటికే పూర్తి చేశామని, రెండో టన్నెల్ పనులు కూడా త్వరలోనూ పూర్తవుతాయని తెలిపారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలనుకుంటే దానిని కొందరు అడ్డుకుంటున్నారని, అది కూడా అంటరానితనమేనని జగన్ అభిప్రాయపడ్డారు. పేదలు గెలిచే వరకూ తమ యుద్ధం కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 98.5 శాతం వాగ్దానాలను అమలు చేశామని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల ప్రజలను ఆదుకుంటూ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇటు అభివృద్ధి వైపు కూడా రాష్ట్రం పరుగులు తీసేలా చర్యలు చేపట్టామని అన్నారు. CM