ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (CBN) పరామర్శించారు. ఇటీవల గద్దర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియల సందర్భంగా హాజరుకాలేకపోయిన చంద్రబాబు ఈరోజు గద్దర్ కుటుంబ సభ్యులను కలసి వారిని ఓదార్చారు. తనకు గద్దర్తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. గద్దర్ చిత్రపటం వద్ద నివాళుర్పించారు.
పెద్దయెత్తున కార్యకర్తలు…
చంద్రబాబు గద్దర్ నివాసానికి వస్తారని తెలిసి పెద్దయెత్తున ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గద్దర్ కుటుంబ సభ్యులను కలసిన చంద్రబాబు (CBN) వారిని ఓదార్చారు. మావోయిస్టు ఉద్యమం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన వరకూ గద్దర్ చేసిన కృషిని ఆయన కొనియాడారు.
చైతన్యం తీసుకు వచ్చి… (CBN)
గద్దర్ తన ఆట.. పాటలతో యువతను చైతన్యపర్చారన్నారు చంద్రబాబు. గద్దర్ లాంటి ప్రజాగాయకుడు ఈ సమావేశానికి అవసరమన్న చంద్రబాబు నియంత ప్రభుత్వాధినేతలను నిలదీయాలంటే గద్దర్ లాంటి గాయకుల అవసరం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గద్దర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గద్దర్ లేని లోటు పూడ్చలేమన్న ఆయన.. ఎందరో కళాకారులను గద్దర్ సృష్టించారని కొనియాడారు. గద్దర్ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని చంద్రబాబు అన్నారు. మానవ హక్కుల కోసం ఆయన పరితపించిన తీరు అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు.