తెలంగాణ TS ఎన్నికలకు ఇంకా వందరోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్షాలు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి అన్ని పార్టీల నేతలు వెళ్లిపోయారు. అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే ఏకంగా గత ఎన్నికల మ్యానిఫేస్టో అమలు పర్చని హామీలను గ్రౌండ్ చేసే పనిలో పడింది. నోటిఫికేషన్ వెలువడేలోపు అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలపై వరాల జల్లు ప్రకటించనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతుంది. వచ్చే నెలలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు రెడీ అయిపోయింది. అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. బీజేపీ కూడా ప్రజల్లోకి వెళుతూ వారి ఆశీర్వాదం కోరుతుంది.
వరాల జల్లు…
అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వివిధ వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపిస్తుంది. లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేసింది. బ్యాంకుల్లో ఈ మొత్తాన్ని నేరుగా జమ చయనుంది. దాదాపు పది లక్షల మంది రైతులు ఈ ప్రకటన ద్వారా లబ్దిపొందనున్నారు. 99,999 రూపాయలు రుణం తీసుకున్న ప్రతి ఒక్కరి రుణం మాఫీ అవుతుంది. ఇందుకోసం 5,809 కోట్ల రూపాయల నిధులను కేసీఆర్ సర్కార్ విడుదల చేసింది. దీంతో పది లక్షల మంది రైతు కుటుంబాల్లో ఆనందం నిండుకుంది. మరోవైపు ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీపై కూడా త్వరలో ప్రకటన వెలువరించడానికి ప్రభుత్వం సిద్ధమయింది. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా తమ ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి కేసీఆర్ ఏ మాత్రం వెనుకాడటం లేదు. నిధుల లేమి వెంటాడుతున్నా ఇచ్చిన హామీలను, కొత్త పథకాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నారు.
అభ్యర్థుల ఎంపికపై… TS
అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగానే ఉంది. తాము అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ఎన్నికల వాగ్దానం చేసింది. దీంతో పాటు నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించనుంది. దీనికి ముందుగానే అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తుంది. సెప్టంబరు నెలలో తొలి జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. కర్ణాటక తరహాలోనే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలన్నది వ్యూహంగా కనపడుతుంది. అధికార బీఆర్ఎస్ అవినీతి, కమీషన్ల గురించి ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణను సిద్ధం చేసింది. మూడు దఫాలు సర్వేలు చేయడం, అనంతరం గెలుపు గుర్రాలకే టిక్కెట్లను ఇచ్చేలా ప్లాన్ చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక జాబితాను హైకమాండ్కు అందచేసినట్లు తెలిసింది.
కేంద్ర నాయకత్వం…
ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి దక్షిణాదిలో తెలంగాణTS లో అధికారానికి వచ్చేందుకు అవసరమైన గేమ్ ప్లాన్ ను సిద్ధం చేసింది. కొత్తగా చేరికలను ప్రోత్సహించాలని, నియోజకవర్గాల్లో బలమున్న నేతలను పార్టీలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంత స్లో అయినట్లు కనిపిస్తున్నా.. స్పీడ్ పెంచాలన్న హైకమాండ్ సూచన మేరకు ఇటీవల కాలంలో నేతలు దూకుడు పెంచారు. నేతలు పెద్దగా చేరకపోయినా ఉన్న నేతలను ఎన్నికల బరిలోకి నింపి అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. ఇందుకోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది. కేంద్ర నాయకుల పర్యటనలతో జనాన్ని తమవైపునకు తిప్పుకోవాలని చూస్తుంది. కేవలం ఎన్నికలకు వంద రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.