Success
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో నిర్వహించిన సద్భావన ర్యాలీ విజయవంతమయింది. ఆయన ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన ర్యాలీకి పెద్దయెత్తున యువత, మేధావులు, మహిళలు పాల్గొనడంతో పార్టీలో ఉత్సాహం నెలకొంది. కొందరు చంద్రబాబు ర్యాలీకి స్వచ్ఛందంగా తరలి వచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక్క పిలుపుతోనే చంద్రబాబు ర్యాలీకి చేరుకుని సంఘీభావంగా పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారని పార్టీ లీడర్స్ అంటున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడే తనకు మద్దతు దొరుకుతుందా? లేదా? అన్న చంద్రబాబు వేసిన ట్రయల్ సక్సెస్ అయిందంటున్నారు.
రాజధానిగా ప్రకటించినా…
జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి విశాఖలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయన్న వాదన వినిపించింది. గత ఎన్నికల్లోనూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ దెబ్బతింటే విశాఖ నగరంలో మాత్రం నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఈసారి ఆ స్థాయిలో స్థానాలు వస్తాయా? రావా? ప్రజల మనసులో ఏముంది? నిజంగా విశాఖ నగరవాసులు రాజధానిని కోరుకుంటున్నారా? లేదా? అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధించడంతో ఇక్కడ రాజధాని వాదం బలంగా ఉందన్న వారు కూడా లేకపోలేదు.
అత్యధిక మంది… Success
అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్నికలకు ముందు నిర్వహించిన సద్భావన ర్యాలీకి మంచి స్పందన రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ర్యాలీలో అత్యధిక మంది కార్యకర్తలు పాల్గొన్నప్పటికీ, చంద్రబాబుకు మద్దతుగా సామాన్య జనం కూడా పాల్గొన్నారని, ఇది చంద్రబాబుకు సపోర్టుగా నిలిచేందుకు వచ్చారని, ఆయన అధికారంలోకి మరోసారి రావాల్సిన అవసరాన్ని గుర్తించారని నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదే కంటిన్యూ అయితే ఈసారి విశాఖ ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు పది స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశముంటుందని ఇప్పటికే నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
పట్టున్నప్పటికీ…
సాధారణంగా తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి విశాఖ ప్రాంతంలో కొంచెం పట్టుంది. విశాఖ రాజధానిగా రాకున్నా తమ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్న కోణంలో ఎక్కువ మంది ఆలోచన సాగుతుందంటున్నారు. భూముల ధరలు పెరిగినా.. తమకు ప్రశాంతత కావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. విశాఖకు గత కొన్ని దశాబ్దాలుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సెటిల్ అయినా, వ్యాపారాలు నిర్వహించుకున్నా పెద్దగా పట్టించుకోని ప్రజలు మాత్రం తమ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడితే మాత్రం అసంతృప్తికి గురవుతారన్న నిజమూ లేకపోలేదు. మొత్తం మీద చంద్రబాబు పర్యటనతో ఇటు తెలుగుదేశం పార్టీలోనూ అటు పార్టీ క్యాడర్లోనూ ఉత్సాహం నెలకొంది.
విజన్ పట్ల… Success
అనంతరం చంద్రబాబు నిర్వహించిన విజన్ 2047 డాక్యుమెంట్ సభకు కూడా పెద్దయెత్తున మేధావులు హాజరవ్వడం ఆయనపై ఉన్న నమ్మకంతోనేనన్నది తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఆలోచనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని విశ్వసిస్తున్నారు. విజన్ ఉన్న నేతగా చంద్రబాబును గుర్తించబట్టే ఆయన నిర్వహించిన ఇండియా, ఇండియన్స్, తెలుగూస్ అన్న విజన్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నారు. ప్రధానంగా మధ్య, ధనిక వర్గాలతో పాటు విద్యావంతులు కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అర్థమవుతుందన్నది చంద్రబాబు చెబుతున్న మాట మరి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. Success