Atal
ఒక నేతను అంత సులువుగా మరువలేం. ఆయన చూపిన మార్గాన్ని విడువలేం. ఆయన అనుసరించిన పద్ధతులు ప్రధానంగా రాజకీయాల్లో ఆయన వేసిన అడుగులు వైపు అందరం వేయాలని కోరుకుంటాం. కలికాలం.. కదా… నాటి రాజకీయ నేతల వ్యవహారశైలి నేటి తరం పొలిటికల్ లీడర్స్లో చూడటమూ అంత సులువు కాదు. కానీ ఏదో ఒక ఆశ. అలాంటి నేతలు కావాలనుకునే వారి సంఖ్య దేశంలో ఎక్కువగా కనపడుతుంది. విననపడుతుంది. ఇన్స్టెంట్ పాలిటిక్స్ ను కాకుండా సుదీర్ఘకాలమైన ప్రజామోదమైన రాజకీయాలు నడిపే నాటితరం రాజకీయ నేతలను ఎప్పటికీ మరువ కూడదు. అందులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఒకరు. నేడు అటల్ బిహారీ వాజ్ పేయి ఐదో వర్ధంతి. ఈ సందర్భంగా రైట్ ఛాయిస్ మీడియా ఆయనకు నివాళులర్పిస్తుంది.
ప్రజాస్వామ్యవాదిగా…
ఆయన ప్రజాస్వామ్యవాదిగా గుర్తింపు పొందారు. ఆయనను బీజేపీ నేతగా ఎవరూ చూడరు. అంటే చివరకు ప్రతిపక్ష పార్టీ నేతలు సయితం ఆయనను ఒక పార్టీ నేతగా చూడరు. తమ వాడిగానే చూస్తారు. దానికి కారణం ఆయన నైజం. ఆయనంటే అందరికీ గౌరవం. రాజకీయాల్లో ఆయన ఎలాంటి విలువలు పాటించారో ఈ తరానికి తెలియకపోవచ్చు. కానీ ఆయనను చూసిన వారి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. పదవుల కోసం వెంపర్లాడరు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయితేనే దానిని ఎన్నికగా పరిగణిస్తారు తప్పించి అడ్డదారిని అసలు ఎంచుకోరు. అదే అటల్ జీ అసలు రహస్యం. అందుకే ఆయన రాజకీయాల్లో అజాతశత్రువుగా నిలిచారు.
విని తీరాల్సిందే… Atal
ఒకరకంగా చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నేతను ఇక భవిష్యత్లో చూడగలమో లేమో? అన్నది సందేహమే. తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన బాధ్యతలను చేపట్టినప్పటికీ హిందూభావ జాలం పూర్తిగా తనలో నింపుకున్నప్పటికీ అదే సమయంలో లౌకికగుణాన్ని సమయానుకూలంగా ప్రదర్శించే వ్యక్తిగా ఆయనను చూడాల్సి ఉంది. మొరార్జీదేశాయ్ తొలి కాంగ్రెసేతర ప్రధాని అనుకున్నా అయన తొలుత కాంగ్రెస్లో ఉండి తర్వాత జనతా పార్టీని పెట్టారు. అందుకే దేశానికి తొలి కాంగ్రెసేతర ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్ పేయి అని మాత్రమే అని చెప్పక తప్పదు. ఆయన ప్రసంగం వినడానికి చెవులు కొరుక్కుంటారే నమ్మశక్యం కాదు. అలాంటి చమ్మక్కులు, ఛలోక్తులతో ప్రసంగం అనర్గళంగా కొనసాగుతుంటుంది. సహజంగా కవి కావడంతో ఇక ఆయన ప్రసంగం గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థులు సయితం ఆయన తమపై చేసిన విమర్శలకు నవ్వుతూనే సమాధానమిచ్చారంటే ఏ స్థాయిలో ఆయన ప్రసంగం ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
నైతిక విలువలతో…
నైతిక విలువలు పుష్కలంగా కలిగిన నేత. దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే అటల్ బిహారీ వాజ్ పేయి వ్యక్తిగత ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెడతారు. అంతెందుకు 1996లో ప్రధానిగా పదవీ బాధ్యతలను చేపట్టిన వాజ్ పేయి పదమూడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఒక్క ఓటుతో పవర్ కు దూరమయ్యారు. అయినా ఆయన ఆనందంగా ఓటమిని స్వీకరించారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లి తిరిగి ప్రజల ద్వారా ఎన్నికైన తర్వాతనే ప్రధాని పదవిని అధిష్టించారు. 2004 వరకూ ఆయన ప్రధాని పదవిలో కొనసాగారు. 2004 తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయి 2009 తర్వాత ఆయన అనారోగ్యం బారిన పడి ఇంటికే పరిమితమయ్యారు.
భిన్నమైన నేతకు నివాళులు… Atal
రాజకీయాల్లో భిన్నమైన నేతగా అటల్ బిహారీ వాజ్ పేయి దేశంలో గుర్తింపు పొందారు. ఆయన హయాంలో భారత్ లో రహదారుల రూపు రేఖలు మారిపోయాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ జాతీయ రహదారి ఏర్పాటుతో పాటు అనేక జాతీయ రహదారులు ఆయన హయాంలో వచ్చినవే. ముందుచూపుతో ఆయన తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి. అలాగే రక్షణ రంగంలోనూ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక విదేశీ వ్యవహారాలు అంటే ఆయనకు కొట్టిన పిండి. అందుకే ఆయన కాలంలో విదేశాంగ వ్యవహారాలు చక్కగా నడిచేవి. విలువలకు కట్టుబడే అటల్ జీ వంటి నేతలు ఇప్పటి భారత్ కు అవసరం అనే కామెంట్స్ ప్రతి చోటా వినపడుతుంటాయి. అలాంటి నేతలు మరలా మనం చూడగలమా? అటల్ జీ మాకోసం “ఒక సారి మళ్లీ పుట్టవూ” అనే వారు కూడా దేశంలో ఎక్కువగా కనపడుతుంటారు. అలాంటి అటల్ జీ మనకు దూరమై ఐదేళ్లు కావస్తుంది. ఆయనకు దేశం ఘన నివాళులర్పిస్తుంది. Atal