YCP
ఏదైనా పట్టుకుని లాగితే అంతే. తెగిపోతుంది. చివర వరకూ ఏదీ ఉండదు. ప్రతి విషయంలో పట్టువిడుపులూ ఉండాలి. అది వృత్తిపరమైన జీవితం కావచ్చు. రాజకీయమైనా కావచ్చు. పట్టువిడుపులు లేకపోతే.. చివరకు దారి ఎటో తేలకుండా పోతుంది. ప్రస్తుతం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పరిస్థిితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆయన పార్టీ హైకమాండ్నే థిక్కరించడంతో అధిష్టానం కూడా డోన్ట్ కేర్ అంటోంది. నియోజకవర్గంలో బలమైన నేత లేకపోతే.. బతిమాలి.. బుజ్జగింపులు జరిపేదేమో. కానీ అక్కడ వల్లభనేని వంశీ ఉండటంతో యార్లగడ్డను వైసీపీ హైకమాండ్ లైట్ గా తీసుకున్నట్లే కనపడుతుంది.
అనుకోకుండా వచ్చి…
నిజానికి యార్లగడ్డ వెంకట్రావు రాజకీయాల్లో పుట్టి పెరగలేదు. ఆయన విదేశాల్లో స్థిరపడి బాగానే సంపాదించారు. సొంత వ్యాపారాలు పెట్టుకుని సక్సెస్ అయ్యారు. అయితే వైసీపీ అధినాయకత్వం పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అనుకోకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అప్పటికే అక్కడ వల్లభనేని వంశీ ఒకసారి గెలిచి ఉండటంతో ఆయనపై ఉన్న అసంతృప్తి తనకు అనుకూలంగా మారుతుందని భావించారు. అయితే చివరకు తక్కువ ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీకి 2019 ఎన్నికల్లో 1,03,881 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావుకు 1,03,043 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు గెలుపు ముంగిట నిలిచినట్లే అనుకోవాలి.
వంశీ రావడంతో… YCP
అదే ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు మనసులో మార్పు తెచ్చింది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ మద్దతుదారుగా మారిపోయారు. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేస్తానని ఆయన పదే పదే చెబుతున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పారిశ్రామికవేత్తగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తనకు తాను సక్సెస్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా నిరూపించుకోవాలనుకున్నా వంశీ దానిని పడనీయలేదు. వైసీపీలోనే ఉంటే యార్లగడ్డకు వచ్చే ఎన్నికల్లోనూ గన్నవరం సీటు దక్కే అవకాశమే లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ యార్లగడ్డ వెంకట్రావును డీసీఎంఎస్ ఛైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పడమని చెప్పారు. అయినా యార్లగడ్డ వెంకట్రావుకు ఆ పదవితో సంతృప్తి దొరకలేదు.
పోటీకి సిద్ధమై…
అందుకే ఆయన ఆత్మీయ సమావేశాల పేరుతో గన్నవరంలో పోటీ చేసేందుకు` సిద్ధమయ్యారు. రెండేళ్ల నుంచి తనకు వైసీపీ హైకమాండ్ అంటే జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తన మద్దతుదారుల వద్ద ఆవేదన చెందాడు. ఇది ఆవేదన అని చెప్పే కన్నా తాను పార్టీని వదలి వెళ్లిపోతున్నానని సంకేతంగానే రాజకీయాల్లో చూడాల్సి ఉంటుంది. వల్లభనేని వంశీని కాదని తనకు వైసీపీ గన్నవరం టిక్కెట్ను ఇచ్చే అవకాశం లేదని తెలుసు. అందుకే ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్థి లేడు. అక్కడ వంశీని ధనబలంలో ధీటుగా ఎదుర్కొనే నేత ఆ పార్టీలో లేడు. అక్కడకు వెళితే సీటు.. గెలవడం గ్యారంటీ అని యార్లగడ్డ వెంకట్రావు నమ్మినట్లుంది. అందుకే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది.
టీడీపీలో చేరేందుకు… YCP
బహుశా ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి. రాజకీయాల్లో దేనినీ కొట్టిపారేయలేం. అలాగే పాలిటిక్స్ అనేవి లాటరీలాంటివి. లక్ ను పరీక్షించుకోవడంలో తప్పులేదు. అలాగే యార్లగడ్డ వెంకట్రావు కూడా పార్టీ మారినా తప్పుపట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఒక్కసారి వైసీపీ హైకమాండ్ పిలిచి మాట్లాడుతుందేమోనని భావించిన యార్లగడ్డ వెంకట్రావు నిరాశే ఎదురయింది. ఆయన వ్యాఖ్యలు పార్టీని, హైకమాండ్ను బ్లాక్మెయిల్ చేసేవిగా ఉన్నాయని హైకమాండ్ భావిస్తుంది. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారశైలిని తప్పుపట్టారు. అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థి ఎంపిక ఉంటుందని, ఎవరి బెదిరింపులకు లొంగరని తేల్చ చెప్పడంతో యార్లగడ్డ ఎగ్జిట్ ఖాయమైందనే అనుకోవాలి. పోటీ ఉన్న నియోజకవర్గంలో ఒకరికి ఎమ్మెల్యే పదవి దక్కితే మరొకరికి మరో పదవి దక్కుతుందన్నారు. ఎవరినీ ఆపలేమని ఆయన అనడంతో యార్లగడ్డకు అంతా అర్థమయినట్లుంది. అందుకే త్వరలో ఆయన ఫ్యాన్ పార్టీని వీడి పసుపు పార్టీ కండువాను కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీకి ఒక బలమైన నేత గన్నవరం నియోజకవర్గంలో దొరికినట్లే భావించాల్సి ఉంటుంది. YCP