MIM
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తుంటారు. ఉత్తర భారతంలో కూడా తన పార్టీని విస్తరించాలన్నది ఆయన యత్నం. తాపత్రయం కూడా. అందులో భాగంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం అభ్యర్థులను అక్కడ బరిలోకి దింపుతారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోటీ చేసినా మహారాష్ట్ర, బీహార్ లోనే కొంత మెరుగైన ఫలితాలు సాధించగలిగారు. అంతే తప్ప మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మహారాష్ట్రలో ఎంఐఎం బలంగా ఉందని చెప్పడానికి అక్కడ గెలిచిన స్థానాలే ఉదాహరణ. అలాగే బీహార్ లోనూ మంచి సక్సెస్ సాధించారు.
ఏపీలో మాత్రం…
అయితే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్్లో మాత్రం ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టరన్న రాజకీయ విమర్శలు ఎప్పుడూ ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకూల మిత్రుడిగా ఉన్న ఒవైసీ జగన్ తోనూ అదే తరహాలో వ్యవహరిస్తారన్నది రాజకీయ పార్టీల నుంచి వినపడుతున్న ఆరోపణ. ఏపీలో ముస్లిం సామాజికవర్గం ఏపీలో ఎక్కువగానే ఉంటుంది. అలాగే అధికార వైసీపీ కూడా భారతీయ జనతా పార్టీకి ప్రతి విషయంలో మద్దతుగా నిలుస్తుంది. నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా మోదీతో జగన్ అంటకాగుతున్నారన్నది రాజకీయ పార్టీ నేతలు చెప్పే వాస్తవం. అయినా ఒవైసీ మాత్రం జగన్ విషయంలో మెతక వైఖరిని కనపరుస్తారన్న ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయి.
పరోక్షంగా… MIM
ఎంఐఎం ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీగా నిన్నటి వరకూ గుర్తింపు పొందినా ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఎంఐఎంపై మరొక అపవాదు కూడా వినపడుతుంది. బీజేపీని గెలిపించడానికి పరోక్షంగా ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దించి కమలం పార్టీకి సాయ పడుతుందన్న విమర్శలు కూడా వినిపించాయి. 2014 ముందు వరకూ లౌకిక పార్టీగా ఉన్న కాంగ్రెస్ తో కలసి ఉన్న ఎంఐఎం రాష్ట్రం విడిపోయిన తర్వాత మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ కు తోడుగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఏపీ నుంచి ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారా? లేదా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసలు పోటీ చేస్తారా? లేక జగన్ కు పరోక్షంగా మద్దతుగా నిలుస్తారా? అన్నది ఎన్నికల నాటికి తేలకున్నా ఇప్పటికైతే ఈ చర్చ రాజకీయ పార్టీలో జోరుగా సాగుతుంది.
నిర్ణయంపై ఉత్కంఠ…
ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలవడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. కామన్ సివిల్ కోడ్ ను వ్యతిరేకించాలని కోరడానికే అసద్ భేటీ అయినట్లు వార్తలు వస్తున్నా రానున్న ఎన్నికల్లో ఏపీలో వ్యవహరించాల్సిన తీరుపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఎంఐఎం ఏపీలో అభ్యర్థులను పోటీకి దింపినా అది నామమాత్రంగానే ఉంటుందన్నది విపక్షాల ఆరోపణ. ఒవైసీ చంద్రబాబును శత్రువుగా చూస్తారని, అందుకోసమే ఆయన పరోక్షంగా జగన్ కు సాయం చేస్తారన్నది విపక్షాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే దేశమంతటా పోటీ చేస్తూ పార్టీని విస్తరిస్తానంటున్న అసద్ భాయ్ ఏపీకి వచ్చే సరికి రూటు మార్చేస్తారంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో అసద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. MIM