తెలంగాణ ముఖ్యమంత్రి KCR , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికలకు తన టీంను రెడీ చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారాన్ని కూడా త్వరలో ముమ్మరం చేయాలని నిర్ణయించారు. శ్రావణమాసం నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. శ్రావణమాసం శుభసూచకం కావడంతో అప్పుడు ప్రచారం మొదలు పెడితే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే వీలుందన్న విశ్వాసం ఆయనలో ఉంది. అందుకే తొలి విడత అభ్యర్థుల జాబితాను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో యాభై మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలిసింది.
జిల్లాల పర్యటనకు…
ఈ నెల 20వ తేదీ నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి ఆయన పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్లు, పార్టీ కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్ ముమ్మరంగా రిబ్బన్ కటింగ్ లు చేయాలని నిర్ణయించారు. వరస పర్యటనలు, సభలో ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కనీసం వంద సీట్లను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రచారం సాగనుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పార్టీ క్యాడర్ ను చైతన్య వంతం చేయడంతో పాటు ప్రత్యర్థులను తన పర్యటనల ద్వారా మాటలతో కేసీఆర్ చీల్చి చెండాడనున్నారు.
యాభై సీట్ల వరకూ… KCR
తొలి విడతగా కేసీఆర్ యాభై సీట్లను ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. తొలి జాబితాలో ఖచ్చితంగా గెలిచే వారి పేర్లనే ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో ఒకేదఫా 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఈసారి విడతల వారీగా ప్రకటిస్తారని చెబుతున్నారు.ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించారు. సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికలో ఈసారి రాజీ పడే ప్రసక్తి ఉండదన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. తొలి విడత జాబితాలో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్ కన్ఫర్మ్ చేయనున్నారు. జాబితాను మూడు వర్గాలుగా విభజించినట్లు తెలిసింది. మూడో విడతగా ప్రత్యర్థులను బట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెబుతున్నారు.
రెండు రోజుల్లో…
ఒకటి ఖచ్చితంగా గెలిచే అభ్యర్థుల జాబితా. ఈ జాబితాను ఈ నెల 20వ తేదీన విడుదల చేసే అవకాశముంది. రెండోది కొంచెం కష్టపడితే గెలుపు అవకాశాలున్న జాబితా. ఈ జాబితాను వచ్చే నెల మొదటివారంలో విడుదల చేసే అవకాశముంది. మూడో జాబితాలో గెలుపు అవకాశాలు లేని వారుంటారు. వీరిని పక్కన పెట్టి కొత్తవారిని ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో గులాబీ దళపతి ఉన్నారు. వీరిలో సీనియర్లు కూడా ఉన్నారంటున్నారు. కొందరు సీనియర్లకు కూడా పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. టిక్కెట్లు ఈ దఫా పొందలేని వారికి ఏదో ఒక పోస్టును ఇస్తామని కూడా కేసీఆర్ చెప్పే అవకాశాలున్నాయి.
ప్రత్యర్థులను బట్టి… KCR
ఐదేళ్లు అధికారంలో ఉండటంతో సహజంగా ఉన్న అసంతృప్తిని పారదోలి అధికారాన్ని రాబట్టుకునేందుకు కేసీఆర్ ఈసారి రాజీపడకుండా వ్యవహరిస్తారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలుగా పంపి.. వారి స్థానంలో టిక్కెట్ దొరకని వారిని ఎమ్మెల్సీగా పంపేందుకు కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి రాజయ్య స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశమివ్వాలని కారు పార్టీ అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు. వీరితో పాటు మరికొందరు మంత్రుల విషయంలో కూడా కొంత అసంతృప్తి నెలకొందని, వారి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నది కేసీఆర్ అభిమతంగా కనిపిస్తుంది.
తొలి జాబితాలో…
ఎన్నికలకు ఇంకా కేవలం 90 రో్జులు మాత్రమే సమయం ఉంది. డిసెంబరు నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అభ్యర్థులు జనంలోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు తగిన సమయం కావాలని కేసీఆర్ ముందుగానే జాబితాను విడుదల చేస్తున్నారు. ప్రత్యర్థి ఎవరన్నది చూడకుండా తొలి జాబితాను విడుదల చేస్తారన్న సమాచారంతో గులాబీ పార్టీ నేతల్లో్ గుబులు బయలుదేరింది. తొలి జాబితాలోనే తనకు టిక్కెట్ వస్తే చాలునని, మొక్కులు మొక్కుకునే వారు కొందరయితే.. వివిధ రూపాల్లో కేసీఆర్ దృష్టిలో పడేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. మరి తొలి జాబితాలో ఎవరుంటారన్నది మరో రెండు రోజుల్లోనే తేలనుంది.