వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీ పెట్టినప్పుడు అనేక అనుమానాలు వచ్చాయి. తెలంగాణలోనే షర్మిల పార్టీ పెట్టడానికి కారణాలేంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టొచ్చు కదా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. వైఎస్సార్ తెలంగాణపార్టీ పెట్టినప్పుడు ఆమెను సోషల్ మీడియాలో అనేక మంది ట్రోల్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత షర్మిల తెలంగాణకు వచ్చి ఏంసాధిస్తారని కూడా అనేక మంది నెటిజన్లు ప్రశ్నించారు. అయినా షర్మిల మాత్రం సుదీర్ఘ పాదయాత్ర కొనసాగించింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరోసారి వైఎస్ షర్మిలపై ట్రోలింగ్ ప్రారంభమయింది.
పాదయాత్రకు పూనుకుని…
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను బీజేపీ వదిలిన బాణమన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెడ్డి సామాజికవర్గం ఓట్లను చీల్చేందుకు షర్మిల చేత పార్టీ పెట్టించారని కూడా కొందరు వాదించారు. కానీ షర్మిల పాదయాత్రలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే టార్గెట్ చేశారు. కేసీఆర్ కుటుంబం పైన, ఎమ్మెల్యేలపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగడంతో అనేక చోట్ల ఆమె పాదయాత్రకు ఇబ్బంది ఏర్పడింది. బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. నరసన్నపేటలో అయితే ఆమె వాహనంపై రాళ్లు రువ్వారు. షర్మిల పార్టీ కార్యకర్తలపై దాడులకు కూడా పూనుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో షర్మిల పాదయాత్రను పోలీసులు నిలిపేశారు. హైకోర్టును ఆశ్రయించి మరలా షర్మిల పాదయాత్రకు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది.
కాంగ్రెస్ లో చేరతారంటూ… (YS Sharmila)
అయితే గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటున్నారు. ఢిల్లీకి కూడా ఆమె వెళ్లి రావడతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. తెలంగాణలో పార్టీ బలోపేతానికి షర్మిల కృషి చేస్తుందని కోమటిరెడ్డి వర్గం అంటుండగా, షర్మిల కారణంగా ఇక్కడ పార్టీకి మైనస్ అని మరో వర్గం వాదిస్తుంది. గత ఎన్నికల్లో మహాకూటమి పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్న కారణంగానే కేసీఆర్ కు తెలంగాణవాదం అస్త్రం చేతికిచ్చినట్లయింది. మరోసారి ఆంధ్ర మూలాలున్న షర్మిలను పార్టీలో చేర్చుకుంటే రాజకీయంగా నష్టపోతామని మరొక వర్గం వాదిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గం షర్మిల రాకను వ్యతిరేకిస్తుంది. కోమటిరెడ్డి వర్గం మాత్రం ఆమె రాకను స్వాగతిస్తుంది.
పాలేరులో పోటీకి…
ఇదిలా ఉండగా షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అక్కడ ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని కూడా పెట్టారు. కాంగ్రెస్ లో చేరితే పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవచ్చన్న ఆలోచన కూడా షర్మిలకు ఉందంటున్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమా? లేక పొత్తు పెట్టుకోవడమా? అన్న దానిపై ఇంకా ఎటూ హైకమాండ్ తేల్చలేదన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. షర్మిల మాత్రం కాంగ్రెస్ కు కొంత అనుకూలంగానే ఉన్నారు. కాంగ్రెస్ లో చేరితే తన తండ్రి వైఎస్ ఆశయాలను కొనసాగించే అవకాశముందని ఆమె భావిస్తున్నారు. అందుకే ఆమె ఇటీవల ఢిల్లీ పర్యటన చేసినట్లు కనపడుతుంది. క్యాడర్ పెద్దగా పార్టీకి తెలంగాణలో లేకపోయినా తండ్రి వైఎస్ కు సంబంధించిన ఓటు బ్యాంకుపైనే షర్మిల ఆశలు పెట్టుకున్నారు.
అడ్డుకుంటారా? (YS Sharmila)
కానీ కాంగ్రెస్ పార్టీ కదా? చివరినిమిషం వరకూ షర్మిల విషయంలో తేల్చే అవకాశాలు ఉండకపోవచ్చు. కర్ణాటక తరహాలో అందరినీ కలుపుకుని పోవడంతో పాటు ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవడానికి షర్మిల ఉపయోగపడతారని కాంగ్రెస్ లో కొందరు భావిస్తున్నారు. మరోవైపు షర్మిల పార్టీలో చేరితే ఆమెకు ప్రాధాన్యత ఎక్కువయితే తమ పరిస్థితి ఏంటని అడ్డుకునే వారు కూడా అధికంగానే ఉన్నారు. షర్మిల పార్టీ పెట్టిన సందర్భంలో బీజేపీ వదిలిన బాణం, కేసీఆర్ పార్టీ పెట్టించారన్న ఆరోపణలు మాత్రం అవాస్తవమని తేలింది. ఆమె ప్రయాణం కాంగ్రెస్ తో పొత్తు లేదా పార్టీలో విలీనం చేసే దిశగా సాగుతుందా? లేక ఒంటరిగా పోటీ చేస్తారా? అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది. షర్మిల మాత్రం బీఆర్ఎస్ పై విమర్శలు మానలేదు. ఆమె ఈరోజు గజ్వేల్ పర్యటనకు వెళుతుండటం, హౌస్ అరెస్ట్ చేయడంతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోటస్ సాండ్ నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (YS Sharmila)