(Plain)
ఆకతాయిల ఫోన్లతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా వాటిని లైట్ తీసుకోలేరు. ఎందుకంటే నిజం కావచ్చు. అందుకే బాంబు బెదిరింపు కాల్స్ అంటేనే విమానాల నుంచి రైళ్లు వరకూ నిలిచిపోతాయి. తనిఖీలు పూర్తి స్థాయిలో జరిపిన తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. సెక్యూరిటీ అధికారులకు ఫేక్ ఫోన్ కాల్స్ తలనొప్పిగా మారాయి. కొందరు తాము ఆలస్యమయితే విమానాన్ని ఆపేందుకు బాంబు ఉందని బెదిరించిన సంఘటనలు కూడా చూశాం. కొందరు మాత్రం ఆట పట్టించడానికి ఫోన్లు చేస్తుండగా, మరికొందరు సైకోగాళ్లు ఈ తప్పుడు పనులకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో భద్రత బలగాలతో పాటు సిబ్బంది కూడా హైరానా పడాల్సి వచ్చింది. ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. కాసేపు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది.
పూణేకు వెళుతున్న…
శుక్రవారం కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదే జరిగింది. ఢిల్లీ నుంచి పూణేకు విస్తారా వెళుతున్న విమానంలో బాంబు ఉందని ఒక ఆగంతుకుడు చేసిన ఫోన్ కాల్ అలజడిని సృష్టించింది. టేకాఫ్ అయిన విమానాన్ని సిబ్బంది అత్యవసరంగా దించారు. సెక్యూరిటీ సిబ్బంది విమానమంతా తినిఖీలు చేశారు. కానీ బాంబు ఉన్న జాడలు ఎక్కడా కనిపించలేదు. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఏమీ లేదని తేల్చిన తర్వాత విమానం టేకాఫ్ కు ఢిల్లీ విమానాశ్రయం అధికారులు అనుమతి ఇచ్చారు. కాసేపు మాత్రం విమానాశ్రయంలో ఈ ఘటన కలకలం సృష్టించింది. భద్రత సిబ్బంది హడావిడితో ప్రయాణికులు కూడా భయపడ్డారు.
టేకాఫ్ అయిన… (Plain)
ఢిల్లీ నుంచి పూణేకు వెళుతున్న విస్తారా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బాంబు ఉందంటూ ఫోన్ రావడంతో తిరిగి విమానాన్ని ఎయిర్ పోర్టులో దించేశారు. ప్రయాణికుల లగేజీని కూడా విమానం నుంచి దించి తనిఖీలు చేశారు. జీఎంఆర్ కాల్ సెంటర్ కు ఈ ఫోన్ రావడంతో ఒక్కసారిగా అప్రమత్తమయిన అధికారులు వెంటనే విమానాన్ని తనిఖీ చేయగా అక్కడ బాంబు వంటిది లేదని స్పష్టమయింది. దీంతో తిరిగి విమానాన్ని పూణేకు వెళ్లేందుకు అనుమతించారు. బాంబు ఉందని ఫోన్ రావడంతో దాదాపు విమానం గంట సేపు నిలిచిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వాళ్లు సైకోలని కొందరు ప్రయాణికులు తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఆగంతుడి కోసం…
ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాశ్రయానికి బాంబు ఉందని వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫోన్ చేసింది ఎవరు అన్న దానిపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆకతాయి ఫోన్ చేసి ఉంటారని పోలీసులు నిర్ధారించినా ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తమ ప్రయాణ సమయం వృధా అయిందని, ఇటువంటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాల్సి ఉంటుందని విమానాశ్రయ అధికారులకు ప్రయాణికులు కోరుతున్నారు. మొత్తం మీద విమానంలో ఎలాంటి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నా, ప్రయాణికులు మాత్రం అసహనానికి గురయ్యారు. (Plain)