YCP
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హీట్గానే ఉంటాయి. అక్కడ అధికార, ప్రతిపక్షాలు బలంగా ఉండటంతో ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజు నుంచే వాడి వేడిగా విమర్శలు వినిపిస్తుంటాయి. ఏపీలో పొలిటికల్ సౌండ్ పొల్యూషన్ 24/7 ఉంటుంది. అందుకే రాజకీయాలంటే ఏపీలోనే చూడాలి అంటారు. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దాని విషయం వేరే చెప్పాల్సిన పనిలేదు. అధికార, విపక్షాలన్నీ జనం బాట పట్టాయి. ప్రజలను మంచి చేసుకునే ప్రయత్నం జరగుతుంది. మూడు నెలలే ఎన్నికలున్న తెలంగాణలో రాజకీయాలు ప్రశాంతంగా ఉన్నా దాదాపు పది నెలలకు పైగానే సమయం ఉన్న ఏపీలో మాత్రం హాట్ హాట్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయి.
ఏపీలో సర్వేల హడావిడి…
ఈ పరిస్థితుల్లో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే సర్వే సంస్థలు దృష్టి పెట్టాయి. ఎక్కువగా ఇక్కడే సర్వే సంస్థలు మకాం వేసి సర్వేలు చేస్తూ జనానికి టాపిక్ను అందిస్తున్నాయి. అయితే జగన్ ఐదేళ్ల పాలనపై అసంతృప్తి భారీగా ఉందని విపక్షాలు నమ్ముతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ఈసారి తమ గెలుపు ఖాయమంటూ టీడీపీ సోషల్ మీడియాలో అభిమానులు హోరెత్తిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే చెప్పాల్సిన పనిలేదు. జగన్ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని, ఈసారి ప్రభుత్వంలో జనసేన ఖచ్చితంగా ఉంటుందని జనసేనాని చెబుతూ వస్తున్నారు.
జగన్కు అనుకూలంగా… YCP
ఈ నేపథ్యంలో వస్తున్న సర్వేలు మాత్రం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తున్నాయి. ఏ సర్వే వస్తున్నా జగన్కు అనుకూలంగా వస్తుండటంతో ఆయన గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదన్నది వైసీపీ నేతల విశ్వాసం. ప్రతి సర్వేలోనూ జగన్కు ఎదురులేకుండా స్థానాలు రావడం ఇందుకు నిదర్శనమని, ఏపీ ప్రజలు మరోసారి జగన్ పాలనను కోరుకుంటున్నారని వైసీపీ నేతలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. గతంలో వచ్చిన అనేక సర్వేలు కూడా వైసీపీకి వన్సైడ్ విక్టరీని చెప్పేశాయి. దీంతో జగన్ గ్రాఫ్ ఏమాత్రం పడిపోలేదన్న విషయాన్ని వైసీపీ నేతలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ బొమ్మమీద గెలుస్తామని కాన్ఫిడెస్స్తో వైసీపీ లీడర్స్ ఉన్నారు.
మళ్లీ వైసీపీకే…
ఇదిలా ఉండగా ప్రముఖ పోల్ సర్వే సంస్థ పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే నిర్వహించింది. వైసీపీకి యాభై ఆరు శాతం ఓట్లు వస్తాయని, చంద్రబాబుకు మాత్రం 35 శాతం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు తొమ్మిది శాతం అనుకూలంగా ఓట్లు వచ్చాయని సర్వేలో తేలడంతో వైసీపీ నేతలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి 51 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 41 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని తేలింది. ఇది వైసీపీకి బూస్ట్ ఇచ్చే అంశమని, ఐదేళ్లయినా జగన్ గ్రాఫ్ ఏ మాత్రం తగ్గలేదని వైసీపీ నేతలు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమయిందని చెప్పడానికి సర్వేలు చెబుతున్న నిజాలే చాలని వైసీపీ నేతలు అంటున్నారు. మరి జగన్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదా? సర్వేలు ఉత్తుత్తిదేనా? అన్నది రానున్న ఎన్నికల ఫలితాల తేలనుంది. YCP