మణిపూర్ (Manipur) లో హింస ఏమాత్రం ఆగడం లేదు. భారీ భద్రతను ఏర్పాటు చేసినా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించినా, పార్లమెంటులో మణిపూర్ అంశంపై రగడ జరిగినా అక్కడ మాత్రం గొడవలు ఆగకపోవడం గమనార్హం. మీతీ, కుకీ తెగల మధ్య గత కొంత కాలంగా చెలరేగుతున్న ఘర్షణలు ఏ మాత్రం ఆగడం లేదు. అవి అమాయకుల హత్యలకు దారి తీస్తున్నాయి. ఒక ప్రాంతంలోని ప్రజలు మరొక ప్రాంతంలోకి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దించినా ఫలితం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్షణం క్షణం ప్రజలు భయం మధ్య గడుపుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. రవాణా వ్యవసథ కూడా పూర్తిగా స్థంభించిపోయింది. అధికారులు కూడా మణిపూర్ లో ఉండేందుకు ఇష్టపడటం లేదు.
మరో ముగ్గురు మృతి
తాజాగా మణిపూర్ లో మరో ముగ్గురు మృతి చెందారు. తోవాయి గ్రామ శివారు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు యువకులు అశువులు బాశారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్తత చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు ఆయుధాలతో కాల్పులు జరపడం వల్లనే తమ వారు మృతి చెందారని ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. తమకు భద్రతను కల్పించడంలో బలగాలు కూడా వైఫల్యం చెందుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. తెల్లవారు జామున జరిపిన ఈ కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించడంతో మరోసారి మణిపూర్ అట్టుడికే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
భద్రత ఏర్పాటు చేసినా… (Manipur)
ఎంత భద్రతను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. భద్రతా బలగాలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్థానిక పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోక పోవడం వల్లనే వరస ఘటనలు జరుగుతున్నాయని ఒక వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ మణిపూర్ ప్రభుత్వం ఘర్షణలను కట్టడిచేయడంలో విఫలమయిందని విపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. విపక్ష నేతలు పర్యటించి రెండు ప్రాంతాలలో పర్యటించి రెండు వర్గాలతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు.
నెలలుగా హింస…
గత నెలలుగా మణిపూర్ లో సాగుతున్న హింస ఏమాత్రం ఆగకపోవడం ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. భారత ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించినా ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. సైన్యం, పోలీసులు పహారా కాస్తున్నా చాటుమాటుగా వచ్చి దుండగులు కాల్పులు జరపడంతో కొందరు మృత్యువాత పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ మణిపూర్ లో జరిగిన ఘర్షణలో 160 మంది మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు. అంతర్జాతీయంగా కూడా మణిపూర్ అంశం చర్చనీయాంశమైంది. మానవ హక్కుల సంఘాలు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులను నమ్మవద్దని, ప్రజలు సహనంతో ఉండాలని పదే పదే ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట హింస చెలరేగుతుండటం రచ్చగా మారుతుంది. (Manipur)