(Good News)
హైదరాబాద్ వాసులు బయటకు వాహనంతో రావాలంటే భయపడిపోతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడదామంటే మెట్రో రైలు నుంచి ఆర్టీసీ బస్సుల వరకూ కిటకిటలాడిపోతున్నాయి. సొంత వాహనాలపై వెళ్లాలంటే ట్రాఫిక్ ఇబ్బందులకు భయపడి పోతున్నారు. అత్యవసర పని నిమిత్తం బయటకు వచ్చినా ఎప్పుడు ఇంటికి చేరతారో కూడా తెలియని పరిస్థితి. నగరంలో ప్రయాణం నరకంగా మారింది. ఇక వర్షం పడితే చాలు.. ఇక చెప్పలేం. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోతాయి. గంటల తరబడి ట్రాఫిక్ ముందుకు కదలదు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నిత్యం హైదరాబాదీలు చూస్తూనే ఉంటారు. ఒకవైపు పెట్రోలు, డీజిల్ వినియోగంతో పాటు జనాలు ఒకరకమైన ఇరిటేషన్ కు గురవుతున్నారు.
కో్ట్లు ఖర్చు చేసి…
అయితే గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ట్రాఫిక్ సజావుగా సాగిపోయేలా చర్యలు తీసుకుంటుంది. సిగ్నల్ ఫ్రీ జంక్షన్లను కూడా ఏర్పాటు చేసింది. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ సజావుగా వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు ఫ్లై ఓవర్ ల నిర్మాణం అవసరమైన చోట్ల గుర్తించి వాటిని పూర్తి చేస్తుంది. ఇందుకోసం ఎస్.ఆర్.డి.పి ప్రాజెక్టు కింద హైదరాబాద్ నగరంలో మొత్తం 48 చోట్ల ఫ్లై ఓవర్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే 35 ఫ్లై ఓవర్లను నిర్మించడంతో ట్రాఫిక్ కష్టాలు కొంత వరకూ తగ్గాయి. మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నప్పటికీ నగరవాసులు ఎక్కువగా సొంత వాహనాల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా మారుతుంది.
ఇందిరా పార్కు నుంచి… (Good News)
నగరంలో ఫ్లై ఓవర్లు, స్కే వేల నిర్మాణం సత్వరం చేపట్టాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పడు అధికారుల వెంట పడుతున్నారు. ఆయన నిత్యం సమీక్షలు చేస్తూ ఫ్లైఓవర్ల నిర్మాణాలు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈరోజు తాజాగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. 2.62 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన ఆసియాలోనే ఇది అతిపెద్ద స్టీల్ బ్రిడ్జిగా చెబుతున్నారు. ఇందుకోసం మొత్తం 450 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇందిరాపార్క్ క్రాస్ రోడ్డు నుంచి వీఎస్టీ వరకపూ వెళ్లే ప్రయాణికులకు ఇది అనుకూలంగా మారనుంది. ఫ్లై ఓవర్ లేనప్పుడు వీఎస్టీ నుంచి ఇందిరాపార్కుకు అరగంట ప్రయాణ సమయం పట్టేది. ఫ్లై ఓవర్ నిర్మాణంతో కేవలం ఐదు నిమిషాల్లోనే ఇందిరాపార్కు నుంచి వీఎస్టీకి చేరుకునే వీలుంది. నిమిషానికి 1200 వాహనాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రయాణిస్తాయి.
ప్రయాణం మరింత సులువు…
ఈ ఫ్లై ఓవర్ ఏర్పాటుతో ప్రయాణం మరింత సులువుగా మారనుందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. డబ్బుకు వెనకాడకుండా హైదరాబాదీలకు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాలను చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ కు మాజీ మంత్రి దివంగత నాయని నరసింహారెడ్డి పేరును పెట్టారు. మరిన్ని ఫ్లైఓవర్లను త్వరలోనే పూర్తి చేసి సిగ్నల్ ఫ్రీగా నగరాన్ని మారుస్తామని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాసయాదవ్, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు,ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. (Good News)