(Elections)
పోయిన చోటే వెదుక్కో్మంటారు పెద్దలు. రాజకీయాల్లోనూ అంతే. ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిచి తామేంటో నిరూపించుకోవాలని రాజకీయ నేతలు సయితం భావిస్తుంటారు. ఒక్కోసారి ఎంతటి వారికైనా ఓటమి తప్పదు. అలా గని ఓటమితో కుంగిపోయి వేరే నియోజకవర్గానికి మారడం కూడా పాలిటిక్స్ లో అవివేకమే అవుతుంది. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అగ్రనేతలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే సోనియా గాంధీ కూడా రాయబరేలీ నుంచి బరిలో ఉండనున్నారు. కానీ రాహుల్ గాంధీ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై నిన్న మొన్నటి వరకూ క్లారిటీ లేదు. ఆయన మరోసారి దక్షిణాది రాష్ట్రం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారా? అన్న చర్చ కూడా పార్టీలో నడుస్తుంది.
గత ఎన్నికల్లో…
2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని అమేధీ, కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేశారు. అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో రాహుల్ అమేధీ లో ఓడిపోయారు. ప్రత్యర్థి స్మృతి ఇరానీ రాహుల్ ను ఓడించడంతో ఆమె మోదీ మంత్రివర్గంలో నేరుగా స్థానం సంపాదించుకున్నట్లయింది. జెయింట్ కిల్లర్ గా మాత్రమే కాకుండా ఫైర్ బ్రాండ్ గా స్మృతి ఇరానీ కిపేరుంది. విపక్షంలో ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంలో స్మృతి ఇరానీ ముందున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అమేధీ నుంచిపోటీ చేయాలన్న పార్టీ ఆదేశాలను స్మృతి ఛాలెంజ్ గా తీసుకుని నెగ్గగలిగారు. రాహుల్ కు ఇదిపరాభవమే. వాయనాడ్ లో గెలిచారు కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఈ పార్లమెంటులో ఆయన అడుగుపెట్టే వారు కాదు. రాహుల్ రెండుచోట్ల పోటీ చేసి మంచిపని చేశారన్నది వాస్తవం.
మళ్లీ రెండు చోట్ల… (Elections)
ఉత్తరాది, దక్షిణాదిలో ప్రభావం చూపడానికే రాహుల్ గత ఎన్నికల్లో అమేధీ, వాయనాడ్ ల నుంచి పోటీ చేశారని పార్టీ నేతలు చెబుతున్నా అదే ఆయన రాజకీయ జీవితానికి మంచిదయింది. ఇప్పుడు రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ మళ్లీ మొదలయింది. గతంలో మాదిరిగా రాహుల్ ఇప్పుడు లేరు. భారత్ జోడో పాదయాత్ర తర్వాత రాహుల్ లో ఎవరూ చూడని మార్పు కనిపిస్తుంది. ఆయనలో పరిణితి చెందిన ఒక సమర్థవంతమైన లీడర్ కనిపిస్తున్నాడు. అంతే కాదు అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని రాటుదేలాడని రాజకీయవర్గాల్లోనూ చర్చజరుగుతుంది. ఆయన సుదీర్ఘ పాదయాత్ర తర్వాత కర్ణాటక ఎన్నికల్లోనూ వన్ సైడ్ విక్టరీ కాంగ్రెస్ పార్టీ సాధించించదన్న విషయాన్ని క్యాడర్ తో పాటు పార్టీ నేతలు కూడా గట్టిగా నమ్ముతున్నారు.
డెసిషన్ ఓకే…
ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ మరోసారి అమేధీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వాయనాడ్ నుంచి బరిలో ఉన్నా అమేధీకి కూడా నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. గాంధీ కుటుంబానికి మంచిపట్టున్ననియోజకవర్గంగాపేరు. అమేధీ నుంచి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గతంలో గెలిచారు. రాహుల్ కూడా అమేధీ నుంచి 2009, 2014లో పోటీ చేసి అక్కడ నుంచే లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. కానీ 2019లో మాత్రం ఓటమి పాలయ్యారు. దాదాపు యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ తో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి అక్కడినుంచి రాహుల్ పోటీకి సుముఖత వ్యక్తం చేస్తారా? లేదా? అన్న సందేహం మొన్నటి వరకూ ఉండేది. కానీ ఉత్తర్ ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రాహుల్ పోటీని ధృవీకరించారు. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో అమేధి నుంచి పోటీచేస్తారని ఆయన చెప్పడంతో మరోసారి రాహుల్ అక్కడే బరిలోకి దిగి తన లక్ ను పరీక్షించుకుంటున్నాడని అర్థమవుతుంది. రాహుల్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా తమ కుటుంబానికి కొన్ని దశాబ్దాల పాటు మద్దతుగా నిలిచిన అమేధీలో రాహుల్ పోటీ చేస్తారన్నది పార్టీ వర్గాలు కూడా చెబుతున్న విషయం. (Elections)