(Nani)
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏ పార్టీలోనూ ఎవరూ శాశ్వతం కాదు. ఎవరూ తోపులు కాదు. పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉన్నరని అన్నట్లే.. ఊహించని పరిణామాలు ఎప్పుడూ జరుగుతుంటాయి. ఎన్నికల సమయంలో మరింత ఎక్కువగా ఇవి కనిపిస్తాయి. తలెగరేసినా.. కాలరెగరేసినా… పార్టీ అధినాయకత్వం పక్కన పెట్టేస్తుంది. అలాగే ఒకటికి రెండు సార్లు గెలిస్తే తమను చూసే జనం ఓట్లేశారని భావించే లీడర్లు అనేక మంది ఉంటారు. వారిలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఒకరు. ఆయన ప్రస్తుతం పార్టీ అధినాయకత్వంపై పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఎంతగా అంటే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండేటంత. పార్టీని ఆయన లెక్క చేయడంలేదు. పార్టీ కూడా ఆయనను పెద్దగా పట్టించుకోక పోవడంతో కేశినేని త్వరలోనే సైకిల్ దిగడం ఖాయంగా కనిపిస్తుంది.
లోకేష్ అంటేనే…
తెలుగుదేశం పార్టీలో నెంబరు 2 అని ఎవరు అంటే… లోకేష్ అని ఎవరైనా ఠక్కున చెబుతారు. చంద్రబాబు పార్టీ అధినేతగా ఉన్నా లోకేష్ నిర్ణయాలే కీలకంగా ఉంటాయి. ఆయన సూచనలను, సలహాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారు. తన వారసుడిని ఏపీ పాలిటిక్స్ లోనూ, అందులో పార్టీలోనూ పూర్తి బలంగా చేయడమే చంద్రబాబు లక్ష్యం. అందుకే లోకేష్ టీంకు ఎప్పుడైనా.. ఎక్కడైనా ప్రయారిటీ దొరుకుతుంది. అది పదవుల్లో కావచ్చు. రేపు సీట్ల కేటాయింపుల్లో కావచ్చు. సీనియర్ల విషయంలో కొన్ని మినహాయింపులున్నప్పటికీ యువతరాన్ని ప్రోత్సహించాలన్న లోకేష్ నిర్ణయాన్ని చంద్రబాబు తు.చ. తప్పక అమలు చేస్తారు. ఈసారి టిక్కెట్లలో ఎక్కువ మంది యువతకే చంద్రబాబు కేటాయింపులు చేసే అవకాశముంది. లోకేష్ మాట కాదని పార్టీలో మనుగడ అసాధ్యమన్నది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది.
పాదయాత్రకు దూరం… (Nani)
అలాంటి లోకేష్ గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే 2,500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో ఆయన పాదయాత్ర ప్రవేశించింది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో లోకేష్ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. అయితే విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని మాత్రం పాదయాత్రలో కనిపించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగని పార్టీని వదిలి వెళతానని చెప్పడం లేదు. తాను మరోసారి పోటీచేయడం ఖాయమని కేశినేని నాని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తొలి రోజు లోకేష్ పాదయాత్రకు నాని డుమ్మా కొట్టడంతోఆయన పార్టీకి దూరమవుతారా? పార్టీ ఆయనను పక్కన పెడుతుందా? అన్నది కాలమే తేల్చాల్సి ఉన్నా ఇప్పటికైతే లోకేష్ పాదయాత్రలో పాల్గొనకపోవడం పట్ల పార్టీ సీరియస్ గానే తీసుకుంటుంది.
సోదరుడికి బాధ్యతలు…
దీనికి ప్రధాన కారణం కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసే బాధ్యతను నాని సోదరుడు కేశినేని చిన్నికి అప్పగించారు. కేశినేని చిన్నిని గత కొంతకాలంగా పార్టీ హైకమాండ్ ప్రోత్సహిస్తుంది. పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో తనకు పోటీకి తన సోదరుడిని దింపుతున్నారని గమనించిన నాని పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తనకు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధులను సయితం వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు కేటాయించారు. వైసీపీ ఎమ్మెల్యేలను పొగుడుతుండటం కూడా పార్టీ అధినాయకత్వానికి ఇబ్బంది కరంగా మారింది. కేశినేని నానితో మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ నేతలు బుద్ధావెంకన్న, నాగుల్ మీరా వంటి వారితో పడదు. వారిని నేరుగా విభేదిస్తున్న నానికి ఆయన సోదరుడి ద్వారానే పార్టీ నాయకత్వం చెక్ పెట్టిందని చెప్పాలి.
ఇక గుడ్ బై ఖాయమా? (Nani)
కేశినేని నాని పాదయాత్రకు దూరంగా ఉండటంతో ఆయన అధినాయకత్వాన్ని పూర్తిగా ధిక్కరించినట్లయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ కేటాయించడం కష్టమే. అందుకే ఇప్పుడు కేశినేని నాని ఎక్కడ నుంచి? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకయితే పార్టీ హైకమాండ్ విజయవాడ పార్లమెంటు విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన బరస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. వైసీపీ నేతలు కూడా కేశినేని నానిని ప్రశంసిస్తుండటంతో వైసీపీలో చేరతారని భావించినా ఆయన అడుగులు అటు పడకపోవచ్చు. విజయవాడ పార్లమెంటు నుంచి రెండు సార్లు గెలిచిన నాని మూడోసారి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది. లోకేష్ పాదయాత్రకు గైర్హాజరుకావడంతో ఇది మరింత బలపడింది. దీంతో మరోసారి బెజవాడ రాజకీయాలు హీటెక్కనున్నాయి. (Nani)