తెలుగుదేశం పార్టీకి (TDP) పెద్ద సమస్య తీరింది. ధీటైన అభ్యర్థి కోసం వెదుకుతున్న పార్టీకి సరైనోడు దొరికాడు. అంగ, ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న నేత దొరకడంతో టీడీపీ నేతలు కూడా సంబరపడిపోతున్నారు. గన్నవరం అంటేనే ముందుగా గుర్తొచ్చేది వల్లభనేని వంశీ. రెండుసార్లు మాత్రమే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో పాతుకు పోయారు. తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్థి లేరక్కడ. దాసరి కుటుంబాన్ని బరిలోకి దింపాలనుకుంటున్నారు చంద్రబాబు. దాసరి కుటుంబానికి ఆ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం కారణంగా వల్లభనేని వంశీకి చెక్ పెట్టవచ్చని చంద్రబాబు మొన్నటి వరకూ అనుకున్నారు. బచ్చుల అర్జునుడును తొలుత నియమించినా ఆయన మృతితో కొంత ఇబ్బంది ఎదురయింది. గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారన్న సస్పెన్స్ నేటితో తొలగిపోయింది. తర్వాత పట్టాభిరామ్ అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. పట్టాభి అయితే ఆర్థికంగా వంశీని ఎదుర్కొనలేరని పార్టీ నాయకత్వం ఆయన వైపు మొగ్గు చూపలేదు. అభ్యర్థిని వెదుకుతున్న సమయంలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీకి దొరికారు. పెద్దగా శ్రమ పడకుండానే అభ్యర్థి వెతుక్కుంటూ వచ్చారు.
అనుకోకుండా…
కానీ అనుకోకుండా వైసీపీ నుంచి యార్లగడ్డ బయటకు రావడంతో ఆయనకే టిక్కెట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలున్నాయి. వల్లభనేని వంశీని సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే యార్లగడ్డ అయితేనే బెటర్ అని చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా భావిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న యార్లగడ్డ రావడంతో వంశీని తట్టుకోవడం సులువని పార్టీ వర్గాలు కూడా విశ్వసిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కూడా తోడైతే ఖచ్చితంగా గన్నవరం సీటును కొట్టేయవచ్చన్నది టీడీపీ ఆలోచనగా ఉంది. నారా కుటుంబంపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన వంశీని ఓడించి గన్నవరంలో టీడీపీ జెండా పాతాలన్న పట్టుదల పార్టీ అధినాయకత్వంలో కనిపిస్తుంది. పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోయిన వల్లభనేని వంశీని దెబ్బ కొట్టాలన్న భావనలో నారా కుటుంబం ఉంది.
ఈరోజు బాబును కలిసి… (TDP)
యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ నెల 22వ తేదీన లోకేష్ పాదయాత్ర గన్నవరం చేరుకుంటుంది.లోకేష్ సమక్షంలో ఆయన గన్నవరంలో పార్టీ చేరనున్నారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున జనసమీకరణ చేయడంతో పాటు లోకేష్ పాదయాత్రతో గన్నవరంలో టీడీపీకి మంచి హైప్ తీసుకురావాలని యార్లగడ్డ వెంకట్రావు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే జనసమీకరణకు సిద్ధమయ్యారు. ఇటీవల రెండు దఫాలు ఆత్మీయ సదస్సుల పేరుతో అనుచరులతో భేటీ అయిన యార్లగడ్డ తన వైసీపీలో తనకు జరిగిన అవమానాన్ని వివరించారు. తన కార్యాచరణ చెప్పకున్నా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ఆయన ఈప్రకటన చేశారని తెలిసింది.
టీడీపీ అభ్యర్థి అంటూ…
దీంతో పాటుగా యార్లగడ్డ వెంకట్రావు కూడా విదేశాల్లో వ్యాపారాలు మానుకుని రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఓటమి చవి చూడటంతో దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. వల్లభనేని వంశీని ఓడించి చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులకు గిఫ్ట్ గా ఇస్తానని కూడా పదే పదే చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రను గన్నవరంలో విజయవంతం చేయడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా యార్లగడ్డ ప్రయత్నిస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యార్లగడ్డకు రాకతో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరైనోడు దొరికాడంటూ ఆనందపడిపోతున్నారు. మరి యార్లగడ్డ రాకతో 2024 ఎన్నికల్లో కూడా గన్నవరంలో టీడీపీ జెండా ఎగరాలన్న చంద్రబాబు లక్ష్యాన్ని యార్లగడ్డ నెరవేరుస్తారా? లేదా? అన్నదిచూడాల్సి ఉంది. (TDP)