(TS)
కారు పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. రేపు తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేయనుండటంతో పార్టీ సిట్టింగ్ లలో టెన్షన్ మొదలయింది. సీటు దక్కకుంటే ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. దాదాపు ఇరవై నుంచి ముప్ఫయి మంది ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు దక్కే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఈ పాటికే కేసీఆర్ దీనిపై కసరత్తు పూర్తి చేశారు. తొలి విడత జాబితాలో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులను మాత్రమే ఉండేలా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. కేసీఆర్ మొత్తం రెండు జాబితాలను విడుదల చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి విడత జాబితాను రేపు విడుదల చేయనున్నారు. ఇందులో యాభై మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు తొలి జాబితాలో అభ్యర్థులను గులాబీ బాస్ ఖరారు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు…
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుండగా.. వందకు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. వీరందరిలో కొందరికి సీట్లు ఖరారయ్యే అవకాశం లేదు. ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి, ప్రత్యర్థి బలంగా ఉన్న చోట మాత్రం ధీటైన క్యాండిడేట్ ను ప్రకటించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే కొందరి విషయంలో ఆయన ఆలోచిస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ నేతల కోసం కూడా ఆయన అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించిన కేసీఆర్ అవసరమైతే ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకుని వారికి టిక్కెట్లు ఇవ్వాలన్న యోచనలో కూడా ఉన్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాల విషయంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేలను దూరం పెట్టనున్నారు.
కొందరిని మాత్రం… (TS)
అవినీతితో పాటు కొన్ని తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలున్నారు. వారికి జనం నుంచి బాగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 90 శాతం మంది సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. అంటే దాదాపు వందకు పైగా స్థానాలకు రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. అయితే కొన్ని జిల్లాల్లో నేతలు వీక్ గా ఉన్నారు. ఆ జిల్లాల్లోని కొన్నినియోజకవర్గాలకు చివరి జాబితాలో ప్రకటించే అవకాశముంది. ప్రత్యర్థులను బట్టి చివరి నిమిషంలో పేర్లు మార్చినా కేసీఆర్ మార్చవచ్చు. అందుకోసమే చివరి నిమిషం వరకూ కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను తేల్చరని, అంతా అనుకూలంగా మారిన తర్వాతనే ప్రకటిస్తారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరో వైపు కొందరు నేతలు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి తమకు టిక్కెట్లు దక్కేలా చూడాలని కోరుతున్నారు. తమ అభ్యర్థనను అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెబుతున్నారు.
కేటీఆర్ అమెరికాకు…
మరోవైపు మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన తనకు అనుకూలురు, పార్టీకి ఉపయోగపడే నేతల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేతల నుంచి వత్తిడిని తట్టుకునేందుకు ఆయన అమెరికా టూర్ ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు. కానీ తన కుమారుడు హిమాన్ష్ చదువుల కోసం కుటుంబ సభ్యులతో కలసి కేటీఆర్ విదేశాలకు వెళ్లడంతో ఆయనను నేరుగా కలసి తమ గోడును వినిపించాలనుకుంటున్న నేతలకు నిరాశ ఎదురవుతుంది. అందుకే కవిత ఇంటికి నేతలు క్యూ కడుతున్నారు. ఈపరిస్థితుల్లో తొలి జాబితాలో ఎవరి పేర్లు ఖరారవుతాయి? ఎవరు సిట్టింగ్ స్థానాలను కోల్పోతారన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుంది. (TS)