ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. పాడేరు ఘాట్ లో లోయలో పడటంతో నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు తెలిసింది. బస్సులో దాదాపు 38 వరకూ ప్రయాణికులున్నట్లు సమాచారం. బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో ప్రయాణికులు కొందరు తమ సెల్ ఫోన్ ల ద్వారా సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించాయి. చోడవరం నుంచి పాడేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురయింది.
నలుగురు మృతి…
ఈ దుర్ఘటనలో నలుగురు మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది. అయితే గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బస్సు లోయలో పడిన వెంటనే స్థానికులు బస్సులో ఉన్న వారిని బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చే లోపు స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు మార్గమధ్యంలో ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరణించినట్లు తెలిసింది.
అదుపు తప్పి… (accident)
ఘాట్ రోడ్డు మలుపులో చెట్టు కొమ్మను తప్పించబోయి డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు వంద అడుగుల లోయలో పడటంతో సహాయక చర్యలు కూడా కష్టసాధ్యంగా మారింది. పాడేరు ఘాట్ రోడ్డులో మోదమాంబ పాదాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయాణికులు అధిక మంది పాడేరు జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది.
అధికారులు అప్రమత్తం…
ప్రమాద వార్త తెలిసిన వెంటనే జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వెంటనే అధికారులను ఆదేశించారు. స్వల్ప గాయాల పాలయిన వారు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఉన్నతాధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ప్రమాద స్థలిని సందర్శించి ప్రత్యక్ష సాక్షులను ప్రమాద కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. 108 వాహనాలను కూడా ఘటన స్థలికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. (accident)