(Ticket) పదేళ్ల నుంచి అసెంబ్లీలోకి కాలుమోపలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంది. 2014లో పోటీ చేసినా ఓటమి పాలు కావడంతో ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార బీఆర్ఎస్ లో చేరారు. సునీతా లక్ష్మారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1999, 2004, 2009 లో ఆమె నర్సాపూర్ నుంచి గెలిచి సత్తా చాటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మరో చెల్లెలుగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డిని కేబినెట్ లోకి కూడా తీసుకున్నారు. 2009 నుంచి 2014 వరకూ సునీతా లక్ష్మారెడ్డి వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ ను వీడి…
మృదు స్వభావిగా పేరున్న సునీతా లక్ష్మారెడ్డి 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ పార్టీలోనూ సునీతమ్మకు మంచి స్థానమే లభించింది. రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్మన్ గా నియమించింది. గత కొద్ది రోజులుగా ఆమె మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ గా పనిచేస్తున్నారు. ఎవరినీ నొప్పించరన్న పేరుంది. కాంగ్రెస్ లో ఉన్న తన అనుచరులతో పాటు ఓటు బ్యాంకును కూడా బీఆర్ఎస్ వైపు మళ్లించడంలో సునీతమ్మ సక్సెస్ అయ్యారు. అయితే ఆమె ఎప్పటి నుంచో మరలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు అక్కడ ఉండటంతో మౌనంగానే ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
సిట్టింగ్ ను తప్పించి… (Ticket)
ఆ అవకాశం రానే వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని తప్పించి సునీతమ్మకు టిక్కెట్ ఇవ్వాలన్న నిర్ణయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. ఆమెకే టిక్కెట్ ఖరారయిందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మంచిపేరుతో పాటు ఓటు బ్యాంకున్న సునీతమ్మను అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఈసారి కూడా అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో ఈసారి కొందరు సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సునీతా లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. ఆమె పేరును కేసీఆర్ ఖరారు చేశారంటున్నారు.
కవితను కలవడంతో…
సునీతా లక్ష్మారెడ్డి ఈరోజు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ను కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ పలు దఫాలు చేసిన సర్వేల్లోనూ సునీతమ్మ పేరు ఎక్కువగా వినపడటంతో ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నారు. 2014లో సునీతా లక్ష్మారెడ్డికి 40 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమె ఆ స్థాయిలో ఓట్లు సాధించడంతోనే తన సొంత జిల్లాలో అన్ని స్థానాలను కారు పార్టీ కైవసం చేసుకోవాలన్నఉద్దేశంలో ఈసారి అభ్యర్థులను మార్చాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే సునీత లక్ష్మారెడ్డి పేరు ఖరారయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ బాగా జరుగుతుంది. మరి కాసేపట్లో కేసీఆర్ తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఆ జాబితాలోనే సునీతా లక్ష్మారెడ్డి పేరు ఉంటుందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. దాదాపు పదేళ్ల తర్వాత సునీతమ్మ అసెంబ్లీలోకి ప్రవేశించాలన్న అభిమతం నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాలి. (Ticket)