(KCR)
ఏ ప్లేసూ.. ఎవరి అడ్డా కాదు. సొంత జాగీరుగా వ్యవహరిస్తే భంగపాటు తప్పదు. అంతకు మించి వేషాలేస్తే ఆ ఎఫెక్ట్ అన్ని ప్రాంతాలపై పడుతుంది. అందుకే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిందే. లేకుంటే జనం ఇంటి అడ్రస్ ఎక్కడే ఇట్టే చూపిస్తారు. అంతకు ముందే పార్టీ అధినాయకత్వం నష్ట నివారణ చర్యలు తీసుకుంటుంది. తాటికొండ రాజయ్య విషయంలోనూ అదే జరిగింది. డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ పిచ్చి వేషాలేస్తే ఆ ప్రాంతం వరకే పరిమితమవుతుంది. అదే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ వెర్రి వేషాలకు దిగడం, రాష్ట్ర వ్యాప్తంగా జనం నోళ్లలో నానడం అంటూ జరిగితే ఆ నష్టం మామూలుగా ఉండదు. అడ్డా అని భావిస్తున్న చోట అడ్రస్ కూడా కనపడకుండా పోతుంది.
నాలుగు సార్లు గెలిచి…
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య పేరు కేసీఆర్ లిస్ట్ నుంచి డిలీట్ అయింది. రాజయ్య తొలిసారి ఎమ్మెల్యే కాదు. ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలిచారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ తోనే ఆయన గెలిచారని చెప్పాలి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాజయ్య కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన తెలంగాణవాదానికి మద్దతు పలకడంతో రాజయ్యను ఘన్ పూర్ ప్రజలు మరోసారి ఎన్నుకున్నారు. 2014 ఎన్నికల్లో రాజయ్యకు కేసీఆర్ పెద్ద పదవే ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రితో పాటు వైద్య ఆరోగ్యశాఖను అప్పచెప్పారు. అయితే ఆయన అవినీతికి పాల్పడ్డారన్న కారణాలతో మంత్రిపదవిని మధ్యలోనే పీకి పారేశారు. తర్వాత పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరికి కేసీఆర్ వద్ద ప్రాధాన్యత క్రమంగా పెరుగుతూ వచ్చింది.
కడియంతో వైరం… (KCR)
కడియం శ్రీహరి, కేసీఆర్ లు తెలుగుదేశం పార్టీలో కలసి పనిచేశారు. ఆ అనుబంధంతో ఆయనకు స్టేషన్ ఘన్ పూర్ సీటు ఇవ్వకపోయినా ఎమ్మెల్సీని చేసి ఉప ముఖ్యమంత్రిని చేశారు. అప్పటికైనా రాజయ్యకు అసలు విషయం తెలిసి రాలేదు. ఘన్ పూర్ నుంచి తనను కేసీఆర్ కదిలించబోరని గట్టిగా నమ్మారు. కడియం శ్రీహరితో అమితుమీకి దిగారు. ఆయనను కలుపుకుని పోయే ప్రయత్నం చేయలేదు. అంతే కాదు కడియం వర్గాన్ని కూడా క్రమంగా దూరం పెడుతూ వచ్చారు. దీంతో కడియం శ్రీహరికి, తాటికొండ రాజయ్యకు మధ్య సుదీర్ఘకాలంగా పోరు కొనసాగుతుంది. ఇది పార్టీ హైకమాండ్ కు కూడా తలనొప్పిగా మారింది. గతంలో వరంగల్ కు వెళ్లిన కేసీఆర్ కడియం శ్రీహరి ఇంట విందుకు కూడా హాజరయ్యారు. అప్పుడే స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ రాజయ్యకు కన్ఫర్మ్ అయినట్లేనని పార్టీలో చర్చ జరిగింది.
సర్పంచ్ ఆరోపణలు…
దీనికి తోడుగా రాజయ్య వివాదాల్లో్ ఇరుక్కోవడం కూడా కడియంకు ప్లస్ గా మారింది. ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించాయి. రాజయ్యపై జానకి రామ్ సర్పంచ్ కురసవల్లి నవ్య చేసిన ఆరోపణలు వైరల్ అయ్యాయి. రాజయ్య ఎంత సమర్థించుకోవాలని చూసినా జనం మాత్రం ఆయనను నమ్మలేదు. సర్పంచ్ నవ్య తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండటమే కాకుండా మీడియాలో కూడా హైలెట్ అయింది. ఆ వివాదం కొన్ని నెలల పాటు నడుస్తూనే ఉండటంతో పార్టీ కూడా డ్యామేజీ అయింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈసారి రాజయ్యకు కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారన్నది ఎవరు ఒప్పుకున్నా… ఒప్పుకోకపోయినా నిజం. మరి రాజయ్య సర్దుకు పోతాడా? లేదా తన సత్తా చూపేందుకు పార్టీ మారి రంగంలో ఉంటారా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. (KCR)