తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 115 స్థానాలకు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఏడుగురు మినహా సిట్టింగ్ లందరికీ తిరిగి టిక్కెట్ ఇస్తూ ఆయన అందరికీ షాకిచ్చారు. 119 మందిలో ఏడుగురు మార్పు అంటే పెద్ద మార్పు అని అనుకోవడానికి వీలు లేదు. అదే సమయంలో మునుగోడు ఎన్నికల సందర్భంగా కామ్రేడ్లను కౌగిలించుకున్న కేసీఆర్ సాధారణ ఎన్నికల సమయానికి వచ్చే సరికి వదిలేశారు. నిజానికి ఈసారి వామపక్ష పార్టీలతో కలసి బీఆర్ఎస్ (BRS) పోటీ చేస్తుందని అందరూ భావించారు. కమ్యునిస్టు పార్టీ నేతలు కూడా కేసీఆర్ తో కలసి నడిస్తే కొంత మనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభిస్తుందని భావించాయి.
పిలుపు వస్తుందని… (BRS)
అందుకే ఆశగా ఎదురు చూశాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో పిలుపు వస్తుందని అనుకున్నాయి. కానీ పిలుపు లేకుండానే కేసీఆర్ నేరుగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో ఇక బీఆర్ఎస్ తో పొత్తు లేనట్లేనని కామ్రేడ్లు కన్ఫర్మ్ అయ్యారు. ఈరోజు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత సీపీఐ, సీపీఎంలు కలసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తమకు బలం ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేసి మిగిలిన స్థానాల్లో ఎవరో ఒకరికి మద్దతిచ్చేందుకు కామ్రేడ్లు ప్రయత్నిస్తారంటారు. కాంగ్రెస్ తో కలిసే ఆలోచన కూడా కమ్యునిస్టు పార్టీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికకు…
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కమ్యునిస్టు పార్టీలతో అవసరం రావడంతో ప్రగతి భవన్ కు పిలిచి మరీ భోజనం పెట్టి హెలికాప్టర్ ఎక్కించుకుని బహిరంగ సభకు కేసీఆర్ తీసుకెళ్లారు. దీంతో కమ్యునిస్టులు ఇక మనల్ని కేసీఆర్ వదులుకోలేరన్న ధీమాలో ఉన్నారు. తాము అనేక నియోజకవర్గాల్లో గెలుపును నిర్దేశించే అవకాశం ఉండటంతో రెండు దఫాల పాలనను పూర్తి చేసుకున్న కేసీఆర్ తమను కలుపుకోక తప్పదని అంచనా వేశారు.కానీ కేసీఆర్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారితో కనీసం చర్చలు జరపలేదు. కనీసం వారితో కలవననికూడా బయటకు చెప్పకుండా ఒక్కసారిగా 115 మంది జాబితాను విడుదల చేయడంతో కామ్రేడ్లు కంగు తిన్నారు.
విడిగా పోటీ చేస్తే… (BRS)
కామ్రేడ్లు విడిగా పోటీ చేస్తే తమకు లాభమన్నది కేసీఆర్ ఆలోచన. అనేక నియోజకవర్గాల్లో వారు పోటీకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, తద్వారా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు సులువవుతుందని కేసీఆర్ అంచనా వేయడంతోనే కమ్యునిస్టులను దూరం పెట్టారు. ఇప్పటి వరకూ తాము అధికార బీఆర్ఎస్ తో కలసి పోటీ చేయాలని భావిస్తూ.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని రెడీ ఉన్న కమ్యునిస్టులకు గులాబీ బాస్ షాక్ ఇచ్చినట్లయింది. దాన్నుంచి తేరుకుని వారు కారు పార్టీకి తాము పరోక్షంగా ఉపయోగపడకుండా కొన్ని స్థానాలకు మాత్రమే పోటీ చేసి, మిగిలిన స్థానాల్లో మాత్రం ఏదో ఒక పార్టీకి అండగా నిలవాలన్న యోచిస్తున్నారు. ప్రధానంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపే అవకాశాలు మాత్రమే ఉన్నాయంటున్నారు. మరి చివరకు కామ్రేడ్ల నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. (BRS)