(BRS)
రాజకీయాల్లో ఓర్పు ఉండాలి. సహనం హద్దులు దాటితే అసలుకే ఎసరు వస్తుంది. ఆవేశం అన్ని వేళలా పనికి రాదు. అతిగా ఆవేశపడే రాజకీయ నాయకుడు రాణించలేడు. ఈ విషయం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విషయంలో నిజమైందనే అనుకోవాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆయన ఫైర్ అయ్యారు. మండి పడింది ఎవరి మీదో కాదు. ఏకంగా కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు మీద. హరీశ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో సవాళ్లు విసిరారు. సిద్ధిపేటలో హరీశ్ రావు ను ఓడించి తీరుతానని ఛాలెంచ్ చేశాడు. తనకు టిక్కెట్ దక్కినా కుమారుడికి ఇవ్వకపోవడంతో ఆయన ఆవేశం హద్దులు దాటింది. దీనికి మైనంపల్లి భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని గులాబీ పార్టీ నేతల నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
టీడీపీతో …
మైనంపల్లి హనుమంతరావు పారిశ్రామికవేత్త నుంచి రాజకీయనాయకుడిగా ఎదిగాడు. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమయింది. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన మైనంపల్లి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో రామాయంపేట నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో కూడా టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో ఆ జిల్లాతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన తన మకాంను మల్కాజ్ గిరికి మార్చారు. టీఆర్ఎస్ లో చేరి ఆయన 2014లో మల్కాజ్ గిరి పార్లమెంటు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత బీఆర్ఎస్ అధినాయకత్వం ఆయనను 2017లో ఎమ్మెల్సీగా చేసింది. తిరిగి 2018 ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీ నుంచి పోటీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా ఆయన రాజకీయాల్లో రాణించడం మొదలుపెట్టాడు.
మెదక్ పై మనసు… (BRS)
మల్కాజ్ గిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేకంగా ట్రస్ట్ పెట్టి సేవలను అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నా ఆయన మనసంతా మెదక్ నియోజకవర్గం పైనే ఉంది. దీంతో మెదక్ నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని ఆయన ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్నారు. మెదక్ లో సేవా కార్యక్రమాల పేరిట ఆయన కుమారుడు రోహిత్ గత కొంత కాలంగా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. అక్కడ రెండు దఫాలుగా పద్మా దేవేందర్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు.అక్కడ తన కుమారుడికి సీటు దక్కకపోవడానికి హరీశ్ రావు కారణమంటూ ఆయనపై మండిపడ్డారు. స్వామి వారి సన్నిధిలోనే నోరుపారేసుకున్నారు. అదీ ఎలాగంటే వినలేని భాషలో ఆయన హరీశ్ రావును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు.
తలసాని సాయికి…
దీనిపై గులాబీ బాస్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలను థిక్కరిస్తూ తోటి పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న మైనంపల్లి హన్మంతరావును ఈ ఎన్నికల్లో పక్కన పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న కేటీఆర్, ఇక్కడే ఉన్న కల్వకుంట్ల కవిత కూడా హరీశ్ రావు పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీంతో పాటు పెద్దయెత్తున మైనంపల్లిపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలు మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆయనకు మల్కాజ్ గిరి సీటు కూడా ఇవ్వవద్దంటూ పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మైనంపల్లిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయనను ఏ క్షణంలోనైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయి. ఆయన స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికి మల్కాజ్ గిరి సీటు ఖరారు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. (BRS)