(cbn)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 28వ తేదీన ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశముందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే రాజకీయపార్టీ నేతలను ఎవరినీ ఈ పర్యటనలో కలిసే అవకాశం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసి తిరిగి నేరుగా విజయవాడ వెళతారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని నేతలు పెద్దయెత్తున ఆరోపిస్తున్నారు.ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నారని కేంద్ర కార్యాలయానికి పార్టీ నేతలు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లకు, ఎన్నికల అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు కేంద్ర కార్యాలయంలో ఉన్న బాధ్యులకు చెబుతున్నారు.
కేంద్ర పార్టీ కార్యాలయానికి…
ఇలాగయితే ఎంతగా ప్రయత్నించినా గెలుపు కష్టమేనని, ఓట్ల తొలగింపును ఆపి, వారి ఓట్లను జాబితాలో తిరిగి చేర్చాలని కోరుతూ అనేక చోట్ల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ నేతలు దిగుతున్నారు. అయినా ఫలితం లేదు. అయితే ఉరవకొండ నియోజకవర్గం విషయంలో అక్కడి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సక్సెస్ అయ్యారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి తన నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో సీఈసీ నేరుగా రంగంలోకి దిగింది. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది. అయితే రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉందని తెలియడంతో చంద్రబాబు కూడా నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
వాలంటీర్ల సాయంతో…
వాలంటీర్ల సాయంతో తెలుగుదేశం పార్టీ ఓటర్లను గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని అనేక చోట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. తొలగించిన ఓట్ల స్థానంలో వైసీపీ అనుకూల ఓట్లను చేరుస్తుండటంతో నేతల్లో ఓటమి భయం పట్టుకుంది. ఒకే ఇంటి నెంబరుతో పదుల సంఖ్యలో పేర్లు ఉండటం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ అనుకూల ఓట్లను పెంచుకుంటూ, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తుండటంతో నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగక తప్పడం లేదు. స్థానిక నేతలు చేసిన ఫిర్యాదులు కూడా బుట్ట దాఖలవుతున్నాయి. దీంతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
సీఈసీని కలిసి… (cbn)
ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి చంద్రబాబు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు పర్చూరు, ఉరవకొండ, విశాఖ నియోజకవర్గాల్లో పెద్దయెత్తున ఓట్ల తొలగింపు జరిగినట్లు అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా జిల్లా కలెక్టర్లకు సమర్పించారు. ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించి స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేయనున్నారు. ఒక ఇంటిలో టీడీపీ అనుకూల ఓట్లు ఐదు ఉంటే నాలుగు తొలగించి, ఒకదానిని మాత్రమే ఉంచుతున్నారు. సాంకేతికంగా ఇబ్బంది రాకుండా అధికారులు అధికార పార్టీకి దన్నుగా నిలుస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెద్దయెత్తున కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో చంద్రబాబు స్వయంగా ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఈ పర్యటనలో బీజేపీ నేతలను కలుస్తారని కొందరు అంటున్నా అటువంటి అవకాశం లేదన్నది పార్టీ కేంద్ర కార్యాలయం చెబుతుంది. (cbn)