(Cheetha)
తిరుమల నడక దారిలో భక్తుల ప్రయాణం భయాల మధ్య కొనసాగుతున్నాయి. రాత్రి వేళ నడక దారిన వెళ్లేందుకు భక్తులు జంకుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వన్యప్రాణులను అడ్డుకోవడం కష్టంగా మారింది. శేషాచలం కొండల్లో చిరుతలు, ఎలుగబంట్లు సంచరిస్తున్నాయి. ఇవి నడక మార్గాన వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని వేటకు దిగుతున్నాయి.వీటిని అడ్డుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా చిరుత, ఎలుగుబంటిని పట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
సురక్షితంగా చేరుకునేందుకు… (Cheetha)
నడక మార్గంలో భక్తులు సురక్షితంగా ప్రయాణించి స్వామి వారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల చేతికి కర్రలు ఇస్తున్నారు. గుంపులు గుంపులుగానే అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి చిన్నారులను కాలినడక ప్రయాణంపై నిషేధం విధించారు. వారిని అనుమతించడం లేదు. చిన్నారులు తప్పిపోకుండా ట్యాగ్ లు కూడా బిగిస్తున్నారు. దీంతో పాటు కాలినడక మార్గంలో సెక్యూరిటీని కూడా పెంచారు. గుంపులుగా నడిచే భక్తుల వెంట ఒక సెక్యురిటీ గార్డును కూడా పంపాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో ఇటీవల నిర్ణయించారు. ఈ మేరకు నిర్ణయాలను అమలు చేస్తున్నారు.
ప్రత్యేక బోనులు…
నిర్ణయాలను కఠినవంతంగా అమలు చేస్తున్నా చిరుత మాత్రం చిక్కడం లేదు. చిరుత, ఎలుగుబంట్ల కోసం ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి బోనులో చిక్కినట్లే చిక్కిచిరుత, ఎలుగబంటి తప్పించుకున్నాయి. బోను వరకూ వచ్చి తృటిలో తప్పించుకోవడంతో అధికారులు నిరాశ చెందారు. బోను వరకూ వచ్చినట్లే వచ్చి తప్పించుకోవడంతో అధికారులు మరలా ఆ ప్రాంతంలోనే మరొక ప్రదేశంలో బోనులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినా అవి దొరకడం లేదు. ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చి పట్టుకుందామని అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
మార్గదర్శకాలను.. (Cheetha)
అయితే దీనిపై చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల కాలినడకన ఇరువైపులా నాలుగు వందల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక చిరుత, ఎలుగుబంటి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గమనించామని ఆయన తెలిపారు. వీటిని బంధించేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామన్న ఆయన భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాలినడకన స్వామి వారిని చేరుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల బోనులో చిక్కిన చిరుత మృతి చెందిన బాలిక లక్షితపై దాడి చేసిందా? కాదా? అన్నది తెలియలేదన్నారు. దానికి సంబంధించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉందని తెలిపారు. అయితే భక్తులు మాత్రం తమతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు. (Cheetha)