చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటూ యావద్భారతావని ప్రార్ధనలు చేస్తోంది. అంతరిక్ష చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేయాలన్న తహతహ మన భారతీయుల్లో కనిపిస్తోంది. జాబిల్లి దక్షిణ ద్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. తాజా సమాచారం ప్రకారం చంద్రుడిపై ఇప్పటి వరకూ సాధారణ వాతావరణమే కనిపిస్తోంది.రోవర్ ల్యాండింగ్ కు సంబంధించిన అన్ని పరికరాలను నిరంతరం, క్షణ క్షణం శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. సజావుగా ల్యాండింగ్ అవగానే ప్రగ్యాన్ రోవర్ లోపలినుంచి బయటకు వస్తుంది. సైడ్ ప్యానళ్లను ర్యాంప్ గా వాడుకుంటూ చంద్రుని ఉపరితలంపైకి వస్తుంది. అక్కడ 14రోజుల పాటు సంచరిస్తూ చంద్రుడి ఉపరితలాన్ని అనేక కోణాల్లో ఫోటోలు తీస్తుంది. ల్యాండర్, రోవర్ లలో ఉన్న పేలోడ్ లు చేసే పరిశోధనల వివరాలు ఎప్పటికప్పుడు శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రంలో ఉన్న సిబ్బందికి సమాచారం పంపిస్తాయి. చంద్రయాన్-2లో ఆర్బిటార్ ఇప్పటికీ చంద్రుని చుట్టూ తిరుగుతోంది.. అందుకని చంద్రయాన్-3 లో దాన్ని పంపలేదు. ప్రొపల్షన్ మాడ్యూల్ తో పాటు ల్యాండర్,రోవర్ లను మాత్రమే పంపారు. చంద్రునిపై వాతావరణం, ఉపరితల నిర్మాణం, నీటి జాడలు అన్నింటినీ ఈ రెండూ నిశితంగా పరిశీలిస్తాయి.
ఆ 14రోజులే కీలకం… 3
ల్యాండర్ లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్.. దీని బరువు 26 కిలోలు. ఇందులో ఉండే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ చంద్రుడిపై ఉన్న మట్టిని విశ్లేషిస్తుంది. ఇందులో ఉన్న లేజర్ కిరణాలు ఆ మట్టిపై పడినప్పుడు ఆ మట్టి కరిగి అందులో ఉన్న రసాయన మూలకాలు, ఖనిజ సంపదను గుర్తించే వీలుంటుంది. ల్యాండర్ లో ఉండే ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్టోమీటర్ ఆ ప్రదేశంలోని మట్టి, రాళ్లలో ఉన్న మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం లాంటి మూలకాలను గుర్తిస్తుంది.విక్రమ్, ప్రగ్యాన్ ల లైఫ్ టైమ్ 14రోజులే..పైగా చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంత సేపే ఈ వ్యవస్థలన్నీ కరెక్ట్ గా పనిచేస్తాయి. సూర్యాస్తమయం కాగానే అంతా చీకటిగా మారిపోతుంది. పైగా ఉష్ణోగ్రతలు కూడా మైనస్ 180 డిగ్రీలకు పడిపోతాయి. అప్పుడు ల్యాండర్, రోవర్ పనిచేయడం సాధ్యం కాదు.. మన భూమిపై 14 రోజులు చంద్రునిపై ఒక రోజుతో సమానం. కాబట్టి 14 రోజుల తర్వాత మళ్లీ అక్కడ సూర్యోదయం అవుతుంది. ల్యాండర్,రోవర్ లపై మళ్లీ సూర్య కిరణాలు పడి అవి మళ్లీ పనిచేయడం అంటూ మొదలు పెడితే అది మన ప్రయోగాలకు , పరిశోధనలకు మరింత మేలు చేస్తుంది. మరి మన ల్యాండర్, రోవర్ సమర్ధవంతంగా పనిచేస్తాయా అన్నది చూడాలి.
నమ్మక్కల్ మట్టిపై ముందే ప్రాక్టీస్…
ఈ మొత్తం ప్రక్రియలో ల్యాండర్ యాక్టివ్ గా ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తేనే భూమికి సంకేతాలు అందుతాయి. చంద్రునిపై ల్యాండర్ సజావుగా నడిచేందుకు ముందు భూమిపైనా దానిని పరీక్షించారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిని పోలిన మట్టి తమిళనాడులో నమక్కల్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి ఆ మట్టిని తెప్పించి దానిపై ల్యాండర్ నడిచేలా ప్రయత్నించారు. ఇలా అన్నివిధాలా ట్రైనింగ్ ఇచ్చిన ల్యాండర్ ను,రోవర్ ను చంద్రుడిపైకి పంపిచారు. ఈ పరిశోధన సక్సెస్ అయితే భవిష్యత్తులో చేసే మరిన్ని ప్రయోగాలకు ఇక్కడినుంచే మట్టిని సేకరించాలని నిర్ణయించారు.