(Y)
చంద్రునిపై కాలు మోపిన ఆనందం టెక్నాలజీ గొప్పదనాన్ని తెలియ చేస్తుంటే అదే టెక్నాజీని ఎలా, ఎప్పుడు వినియోగించాలో తెలియచెప్పే రెండు సంఘటనలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. తమిళనాడులో నిక్షేపంలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న నిండు గర్భిణి నిర్లక్ష్యం కారణంగా చనిపోగా.. చనిపోతుందనుకున్న మరో గర్భిణి నిక్షేపంలా బతికి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వైద్య రంగానికి చెందిన రెండు సంఘటనల వివరాల్లోకి వెళితే…
ప్రాణం తీసిన యూట్యూబ్ డెలివరీ (Y)
తమిళనాట ఓ భర్త చేసిన మూర్ఖపు పనికి నిండు గర్భిణి అయిన భార్య బలైపోయింది. టెక్నాలజీ ని దేనికి వినియోగించుకోవాలో తెలీన ఆ భర్త భార్యకు యూట్యూబ్ చూసి డెలివరీ చేయాలని ప్రయ త్నించడం తల్లి చనిపోడానికి కారణమైంది. తమిళనాడులోని పులియం పట్టి జిల్లాకు చెందిన పోచంపల్లి గ్రామంలో లోక నాయకి (27)అనే నిండు గర్భిణికి ఆమె భర్తే ఇంట్లో సహజ ప్రసవం చేసేందుకు ప్రయత్నించాడు. యూట్యూబ్ లో డెలివరీలకు సంబం ధించిన వీడియోలు చూసి అదే విధంగా ట్రై చేశాడు.. కడుపులో బిడ్డనైతే బయటకు తీశాడు కానీ బిడ్డకున్న బొడ్డు తాడును ఎలా కట్ చేయాలన్నది తెలీక సతమతమయ్యాడు. ఈలోగా రక్తం ఎక్కువగా పోయింది.ప్రాణాపాయ స్థితిలో ఉన్నబాలింతను దగ్గర లోని పీహెచ్ సీకి తరలించినా లాభం లేకపోయింది. ఆమె మరణించింది.వైద్యాధికారుల సమాచారంతో పోలీసులు భర్తపై సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు.. నవజాత శిశువును మాత్రం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లోకనాయకికి నొప్పులొస్తున్నా భర్త ఆమెను ఆస్పత్రికి తరలించకుండా సొంత వైద్యంతో హోం డెలివరీకి ప్రయత్నించడంతో నిండు ప్రాణం బలైంది. తల్లిని కోల్పోయి, తండ్రి పోలీసుల కస్టడీలో ఉండటంతో అనాధలా మారిన పసిబిడ్డను చూసి స్థానికులు తల్లడిల్లుతున్నారు.
గర్భాశయ కేన్సర్ పేషెంట్ కి సేఫ్ డెలివరీ
మరో కేసులో ఢిల్లీలో ఓ కేన్సర్ పేషెంట్ బిడ్డకు జన్మనివ్వడం వైద్యచరిత్రలోనే వండర్ గా మారింది. గర్భాశయ కేన్సర్ తో బాధపడుతున్న39 ఏళ్ల గర్భిణి ఎలాంటి రిస్కు లేకుండా సురక్షితంగా బిడ్డను కన్నది. వైద్యుల పర్యవేక్షణలో డెలివరీ కావడంతో తల్లి, బిడ్డ కూడా సురక్షితంగా ఉన్నారు. మిజోరం కు చెందిన 39 ఏళ్ల మారినా రాల్టే కు 16 వారాల గర్భిణిగా ఉన్న టైమ్ లో గర్భాశయంలో కణితిని గుర్తించారు ఢిల్లీ వైద్యులు. తల్లి , బిడ్డలను రక్షించేందుకు ప్రయత్నించిన ఇంద్రప్రస్థ అపోలో కేన్సర్ ఆస్పత్రి వైద్యులు మారినాకు ఏడు సైకిల్స్ కీమో థెరపీని చేశారు. కీమో చేస్తున్న సమయం అంతా తల్లి గర్భంలో పిండం పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేశారు.
బిడ్డ ఎదుగుదలను, ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు.అయితే ట్రీట్ మెంట్ సమయంలో మారినా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడింది. రెండో కీమో ఇచ్చే టైమ్ లో ఆమెకు రక్తస్రావం ఎక్కువై సీరియస్ అయ్యింది. అయితే రక్త స్రావం ఆగేందుకు వైద్యం చేయడంతో గండం నుంచి ఆమె బయటపడింది. మారినా డెలివరీని కూడా జాగ్రత్తగా చేయాలన్న ఉద్దేశంతో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు.37వ వారంలో ఆరోగ్యవంతమైన శిశువుకు ఆమె జన్మ నిచ్చింది. డెలివరీ అనంతరం ఆమెకు కీమో వైద్యం, రేడియేషన్ థెరపీ, కేన్సర్ కణాన్ని మాత్రమే గురిపెట్టి చేసే బ్రాకీ థెరపీ కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ట్రీట్ మెంట్ తర్వాత ఆమె గర్భాశయం కూడా నార్మల్ కండిషన్ కు రావడమే కాదు.. ఆమె తన బిడ్డను చూసుకుని మురిసిపోతోందిప్పుడు. పై రెండు సంఘటనలూ వైద్యం ప్రాధాన్యతను తెలియ చేస్తాయి. యూట్యూబ్ సకల సమస్యలకు పరిష్కారంలా భావిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి.. అదే టైమ్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వైద్యుల ట్రీట్ మెంట్ తో చనిపోతారనుకున్న వారు కూడా నిక్షేపంలా బతికి హాయిగా ఉన్నారు..ఎవరిపని వారు చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘట నలు తెలియ చేస్తున్నాయి.