(cbn)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ క్షణం ఖాళీగా ఉండరు. ఆయనది 24/7 రాజకీయమే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు కాని, విపక్షంలో నప్పుడు కానీ ఆయన తాను ఖాళీ గా కూర్చోరు. నేతలను కూర్చోనివ్వరు. గతంలో ఆయన తాను నిద్రపోను… మిమ్మల్ని నిద్రపోనివ్వను అన్నట్లు పాలిటిక్స్ చేసేవారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో అసలు ఆగుతారా? ఏడు పదుల వయసులోనూ ఆయన మరింత పరుగులు తీస్తారు. పెట్టిస్తారు కూడా. ఆ సంగతి నేతలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నా, బలంగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ను ఎదుర్కొనాలన్నా ఇంట్లో కూర్చుంటే కుదరదు. అందుకనే ఆయన జనంలోనే ఇక ఉండటానికి రెడీ అయిపోయారు. కరోనా సమయంలో తప్ప దాదాపు మిగిలిన అన్ని రోజులు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ఆయన నియోజకవర్గాలు, జిల్లాలను చుట్టివచ్చారు.
145 నియోజకవర్గాల్లో…
ఇప్పటికే 145 శాసనసభ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించారు. నేతలను కార్మోన్ముఖులను చేశారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలన్న దానిపై ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు తనయుడు లోకేష్ ఎటూ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పూర్తి చేసుకుని త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాల్లోకి కాలు మోపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ మినీ మహానాడుల పేరుతో కొన్ని జిల్లాల్లో పర్యటించారు. అలాగే “బాదుడే బాదుడు”, “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” వంటి కార్యక్రమాలతో నియోజకవర్గాలనను చుట్టి వచ్చారు. మరో 30 నియోజకవర్గాల్లో మాత్రమే ఆయన పర్యటించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను నియమించాల్సి ఉంది.
వచ్చే నెల ఒకటి నుంచి… (cbn)
ఈ పరిస్థితుల్లో తాజాగా సెప్టంబరు 1వ తేదీ నుంచి సరికొత్త కార్యక్రమంతో చంద్రబాబు మరోమారు జనం ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తొలి విడత మ్యానిఫేస్టోను విడుదల చేసిన చంద్రబాబు దసరా నాటికి రెండో విడత మ్యానిఫేస్టోను విడుదల చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అందుకే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బాబు షూరిటీ – భవిష్యత్ కు గ్యారంటీ అనే నినాదంతో జనం ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. మొత్తం నాన్ స్టాప్ గా నలభై రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అంటే వీకెండ్ లో మాత్రం పర్యటనను నిలిపేస్తారు. మిగిలిన ఐదు రోజులు మాత్రం చంద్రబాబు పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రతి ఇంటిని టచ్ చేసేలా…
ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్ ఛార్జి తన పరిధిలోని ప్రతి ఇంటిని టచ్ చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మ్యానిఫేస్టోలో తాము చెప్పిన విషయాలు మాత్రమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఇంటింటికి తీసుకెళ్లాలన్నదే ఈ కార్యక్రమం ప్రయత్నం. ఎవరు నిర్లక్ష్యం చేసినట్లు తెలిసినా తాను సహించేది లేదని నేతలకు చెప్పనున్నారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా నివేదికలు అందేలా చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నేతల యాక్టివిటీని బట్టే రానున్న ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత కూడా ఉండనుండటంతో ఇక తెలుగు తమ్ముళ్లు నియోజకవర్గాల్లో పరుగులు పెట్టాల్సిన పని పడింది. నెల పదిహేను రోజుల తర్వాత మరో కార్యక్రమంతో చంద్రబాబు జనంలోకి వెళ్లాలని.. ఇలా రాబోయే తొమ్మిది నెలలు నేతలతో పాటు తను కూడా జనం మధ్యనే ఉంటూ సమస్యలపై గళమెత్తేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది. (cbn)