Siva shakti,Tiranga
చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ సక్సెస్ పట్ల యావజ్జాతి పులకించిపోయింది. జాబిల్లి పాదం మోపిన చరిత్రాత్మక ప్రాంతానికి, చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ అయిన ప్రాంతాలకూ శివశక్తి, తిరంగా పాయింట్ అని పేర్లు కూడా పెట్టారు. చంద్రయాన్-3 లోని విక్రమ్ ల్యాండర్ పాదం మోపిన ఈ ప్రాంతానికి శివ శక్తి అని పేరు పెట్టడం వెనక పెద్ద ఉద్దేశాలే ఉన్నాయి. సైన్స్, ఆధ్యాత్మిక శక్తులను కలగలిపిన ప్రాజెక్ట్ సక్సెస్ ను శివుని శక్తితో పోలుస్తూ ఈ పేరు పెట్టారు. ఈ పేరును హిందూ పురాణాలనుంచి సేకరించారు. హిందూ పురాణాలలో శివశక్తి అంటే అర్ధ నారీశ్వర రూపం.. శివునిలోనే పార్వతీదేవి కూడా లయమై ఉంటుంది. కాబట్టి శివశక్తి అని పెట్టారు.మనం చేసే మానవ ప్రయత్నాన్ని శివునితో పోల్చుకుంటే, ఆ ప్రయత్నం నుంచి ఉద్భవించిన శక్తి మన ఆకాంక్షను నెరవేర్చింది. శక్తి అంటే మహిళా సైంటిస్టుల కష్టపడే తత్వం, ప్రేరణ, సాధికారతకు నిదర్శనం అని మోడీ ఆ పేరు పై వివరణ ఇచ్చారు.శివ శక్తి అనే పేరు అసలు ఉద్దేశం అది. శివశక్తి పాయింట్ కేవలం పేరు మాత్రమే కాదని, రానున్న తరాలకు ఒక ప్రేరణ అని, సైన్స్ శక్తిని మానవుల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చని ప్రధాని మోడీ అన్నారు.
శివశక్తి అంటే… (Siva shakti)
శివశక్తి అనే పేరుకు మరో ప్రాధాన్యత కూడా ఉంది. చంద్రయాన్-3 మిషన్ లో మహిళా సైంటిస్టుల భాగస్వామ్యానికి ఇచ్చిన నివాళి ఈ పేరు అని మోడీ వివరించారు. సైన్స్అండ్ టెక్నాలజీ రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్నిపెంచేందుకు ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని అన్నారు. ఇది మహిళా శాస్త్రవేత్తల క్రుషికి నిదర్శనం.. సైంటిఫిక్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందనడానికి ఇదొక ఉదాహరణ..అన్నారు.
తిరంగా పాయింట్ అంటే..
ఇక తిరంగా పాయింట్ పేరుకి కూడా ప్రత్యేకత ఉంది. చంద్రయాన్ -2 టైమ్ లో తొలిసారి చందమామ దక్షిణ ధ్రువంపై కాలు పెట్టేందుకు ప్రయత్నించి క్రాష్ అయిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్ అని పిలుస్తున్నారు. అంటే అంతరిక్షంలో మనం జెండా పాతిన ప్రదేశంగా లెక్క. మొత్తానికి ఈ రెండు పేర్లు ట్రెండింగ్ గా మారాయి. ఇవి మన భారతీయతకు, సంస్క్రుతికి చిహ్నంగా మారాయి. మరోవైపు రోవర్ పంపిన ఫొటోలు కూడా ఆసక్తికరంగా మారాయి. శివశక్తి పాయింట్ ను కూడా రోవర్ ఫోటోలు తీసింది. దాంతో చంద్రుడికి సంబంధించిన కొత్త కొత్త ఫోటోలు ఉన్న ఘనత కూడా మన దేశానికే దక్కుతుంది. రోవర్, ల్యాండర్ తీసిన ఫొటోలు,పంపుతున్న సమాచారం చాలా ఆసక్తికరంగా ఉన్నాయని,త్వరలోనే ఫోటోలను రిలీజ్ చేస్తామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. త్వరలోనే చంద్రుడు, అంగారకుడు, శుక్ర గ్రహాలపైకి వ్యోమ నౌకలను కూడా పంపుతామని ఇస్రో ప్రకటించింది. అంతరిక్ష రంగంలో ఆధ్యాత్మికతను జోడించి విజయాలను చవిచూడటం అటు ఇస్రోకే కాదు.. దేశవాసులకూ ఆనందాన్ని కలిగిస్తోంది.
మోడీ మనస్సంతా ఇక్కడే..
సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి ఉన్న మోడీ చంద్రయాన్ జాబిల్లిపై అడుగు పెట్టే నాటికి దక్షిణాఫ్రికాలో ఉన్నా ఆయన మనస్సంతా ఇక్కడే ఉంది. అందుకే తిరుగు ప్రయాణంలో ఢిల్లీ రాకుండా నేరుగా బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. ఆగమేఘాల మీద బెంగళూరులోని ఇస్రో టెలీ మెట్రీ, ట్రాకింగ్, అండ్ కమాండ్ నెట్ వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ కు చేరుకుని సైంటిస్టులను ప్రశంసలతో ముంచెత్తారు. .